అనాథ వృద్ధాశ్రమం తొలగింపు

18 Sep, 2016 00:42 IST|Sakshi

ముకుందాపురం(మునగాల): మండలంలోని ముకుందాపురం గ్రామపంచాయతీ శివారులో జాతీయ రహాదారి పక్కన గత కొంతకాలంగా ఉన్న అనాథ వృద్ధాశ్రమాన్ని శనివారం రాత్రి మండల తహసీల్దార్‌ ఆదేశాల మేరకు మునగాల పోలీసులు బలవంతంగా తొలగించారు.  తహసీల్దార్‌ భద్రయ్య  తెలిపిన వివరాల ప్రకారం... జాతీయ రహాదారి విస్తరణలో భాగంగా మూడేళ్ల క్రితం ముకుందాపురం శివారులో కొంతభూమిని ప్రభుత్వం సేకరించి సదరు రైతుకు నష్టపరిహారం అందించింది. కాగ ఈ ప్రాంతంలో రెండేళ్లుగా  ఓ మహిళ అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో జాతీయ రహాదారి విస్తరణలో భాగంగా క్యాంటిన్‌ ఏర్పాటు చేయాలని జీఎమ్మార్‌ సంస్థ నిర్ణయించింది. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని తొలగించాలని నిర్వాహాకులకు తెలిపినప్పటీకీ తొలగించకపోవడంతో జిల్లా కలెక్టర్‌ దృష్టికి జీఎమ్మార్‌ సంస్థ తీసుకువెళ్లింది. దీంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తొలగించాల్సి వచ్చిందని ఆయన‡ తెలిపారు.  ఈ మేరకు శనివారం రాత్రి మునగాల ఎస్‌ఐ గడ్డం నగేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది వృద్ధాశ్రమాన్ని బలవంతంగా తొలగించారు.
 

మరిన్ని వార్తలు