కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు అందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, పత్రికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా అధికారులు ఇష్టానుసారంగా ఉద్యోగులను నియమించుకున్నారని ఫిర్యాదులు రావడంతో గత సంవత్సరం ఆసుపత్రిలో పనిచేసే 29 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి తొలగించారు. తమను అక్రమంగా తొలగించారంటూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పు పట్ల అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.