పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతం

8 Sep, 2016 23:29 IST|Sakshi
పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతం
జిల్లా పరిషత్‌: జిల్లాలో మూడు సర్పంచ్, ఒక ఎంపీటీసీ, 3 వార్డు స్థానాలకు గురువారం నిర్వహించిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు తరలివచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ కారణాల వల్ల జిల్లాలో మూడు సర్పంచ్, ఒక ఎంపీటీసీ, 38 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, 32 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, మూడు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో మూడు సర్పంచ్, మూడు వార్డు స్థానాలకు గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉప ఎన్నిక నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. బిచ్కుంద మండలం ఎల్లారం సర్పంచ్‌గా మాన్యా రాథోడ్‌ 43 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి కమలాబాయి రాథోడ్‌పై విజయం సాధించారు. అలాగే, నవీపేట్‌ మండలం బినోల సర్పంచ్‌గా ఒల్కె సుధాకర్‌ 186 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి రవిని ఓడించారు. మద్నూర్‌ మండలం సుల్తాన్‌పేట్‌ సర్పంచ్‌గా రాములు తన ప్రత్యర్థి ఈరయ్యపై 320 మెజార్టితో గెలుపొందారు. 
ఇక, దోమకొండ మండలం సంగమేశ్వర్‌ 7వ వార్డు మెంబర్‌గా లక్ష్మీనర్సింహులు, లింగంపేట్‌ మండలం భవానీపేట్‌ 7వ వార్డుసభ్యుడిగా దత్తయ్య, ఎడపల్లి మండలం పోచారంలో 7వ వార్డు మెంబర్‌గా తాడెం ఇస్తారి విజయం సాధించారు. వీరికి రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మద్నూర్‌ మండలంలోని సుల్తాన్‌పేట్, బిచ్కుంద మండలం ఎల్లారం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి పరిశీలించారు.
సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్‌ ఎంపీటీసీ స్థానానికి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. ముషీర్‌నగర్, కొటాల్‌పల్లిలో రెండు పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయగా, ఓటర్లు బారులు తీరారు. మొత్తం 77.94 శాతం పోలింగ్‌ నమోదైందని జెడ్పీ సీఈవో మోహన్‌లాల్‌ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఈవీఎంలను సీజ్‌ చేసి మండల పరిషత్‌ కార్యాలయంలో భద్రపరుస్తామన్నారు. 10వ తేదీన ఉదయం కౌంటింగ్‌ ఉంటుందని వివరించారు.
 
మరిన్ని వార్తలు