బంజారాహిల్స్: నగర పరిధిలోని ఎనిమిది ప్రధాన పార్కులు, చెరువులను తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు దత్తత తీసుకుంటారని మొదటి దశలో బంజారాహిల్స్లోని జలగం వెంగల్రావుపార్కు ను జలమండలి ఎండి దానకిషోర్ దత్తత తీసుకున్నట్లు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కార్పొరేటర్లు కూడా తమతమ పరిధిలోని పార్కులను దత్తత తీసుకోవాలని సూచిం చారు. జేవీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన నిర్మించిన నీటి శుద్ధి కేంద్రం పని చేయకపోవడంతో మురుగునీరు పార్కు చెరువులో కలుస్తున్నదన్నారు. ఈ పార్కును అందంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత దానకిషోర్పై పెడుతున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 కోట్ల మొక్కలు నాటామని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రజలు, పార్కుల వాకర్స్ అసోసియేషన్లు, అధికారులు సమష్టిగా పార్కుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. వారం రోజుల్లో నగర రహదారులను అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో భాగంగా వెయ్యి కిలోమీటర్ల మేర వైట్టాపింగ్ రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, జేసీ గౌరవ్ఉప్పల్ పాల్గొన్నారు.
రెండు రోజుల ముందే
పర్యటన వివరాలు
ఇకపై నగరంలో తాను ఎక్కడ పర్యటించినా రెండురోజుల ముందే అధికారులకు తెలియజేస్తానని ఆ రకంగానైనా తాను పర్యటించే ప్రాంతంలో రోడ్లు, ఇతర పెండింగ్ పనులు పూర్తిచేసే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి వచ్చినపుడే హడావుడిగా పనులు చేస్తున్నారని జలగం వెంగళరావుపార్క్ వాకర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తాను ఎక్కడ పర్యటించేది ముందే అధికారులకు చెబుతానని, ఆదివారం తాజ్బంజారా చెరువును సందర్శిస్తానని తెలిపారు.