మహిళ మృతితో ఆస్పత్రి ఎదుట ఆందోళన

31 Jul, 2016 23:39 IST|Sakshi
మహిళ మృతితో ఆస్పత్రి ఎదుట ఆందోళన
ధవళేశ్వరం:
ప్రసవానంతరం ఓ మహిళ మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. రాజకీయ పార్టీల నేతలతో జరిగిన చర్చల్లో నష్టపరిహారం చెల్లించేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. స్థానిక ఎర్రకొండ ప్రాంతానికి చెందిన గూటాల హేమలత(22) ప్రసవం కోసం శుక్రవారం ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రిలో చేరింది. ఆమె శనివారం సాయంత్రం మగపిల్లవాడిని ప్రసవించింది. కొంతసేపటి తరువాత పల్స్‌ డౌన్‌ అయ్యిందని, ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సీఈఎం ఆస్పత్రి వైద్యులు హేమలతను అంబులెన్స్‌లో పంపారు. అప్పటికే హేమలత మృతి చెంది సుమారు గంట అయ్యి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పడంతో బంధువులు మృతదేహంతో ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రి ఎదుట శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ గిరజాల బాబు, సీపీఎం నాయకులు కర్రి రామకృష్ణ, ఎన్‌.భీమేశ్వరరావు, ఎస్‌ఎస్‌ మూర్తి, సీపీఐ నాయకులు కిర్ల కృష్ణ, టీడీపీ నాయకులు ఇళ్ల రాంబాబు, దుర్గారావు, బత్తిన ఏడుకొండలు, నాళ్ళ రమేష్, డీఎస్పీ నారాయణరావు, సీఐ కృపానందం తదితరులు పలు దఫాలు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.2లక్షలు ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆదివారం మధ్యాహ్నం ఆందోళనను విరమించారు.  

 

మరిన్ని వార్తలు