గొంతెందుకు మూగపోయింది బాబు?

24 Oct, 2015 04:22 IST|Sakshi
గొంతెందుకు మూగపోయింది బాబు?

 సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ రఘువీరా ప్రశ్న

 సాక్షి, హైదరాబాద్/మడకశిర: ‘ఎన్నికలకు ముందు రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఎందుకు అడగలేకపోయారు?. చంద్రబాబు గొంతెందుకు మూగబోయింది?’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో గురువారం ఆయన పార్టీ నేతలు కాసు వెంకటకృష్ణారెడ్డి, సాకె శైలజానాథ్, జంగా గౌతమ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. అలాగే అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో కూడా మాట్లాడారు.

రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లతో ఆర్భాటం చేసిన చంద్రబాబు.. ప్రధాని మోదీ ముందు ‘సార్.. సార్..’ అంటూ సాగిలపడ్డారు తప్ప హోదా గురించి అడగలేదని మండిపడ్డారు. హోదాపై ప్రధాని ప్రకటన చేయనందున దీనికి నిరసనగా మోదీ, చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.  శంకుస్థాపన కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులకు నారా లోకేష్ సూచనలివ్వడానికి ఎవరని రఘువీరా సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ వద్ద చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించినట్లు లోకేష్ కూడా చేస్తున్నారా అని నిలదీశారు.

మరిన్ని వార్తలు