నయీం అనుచరుడు శ్రీధర్‌పై పీడీ యాక్ట్‌

18 Jan, 2017 03:50 IST|Sakshi

నాగోలు: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు, రౌడీ షీటర్‌ పొలిమేటి శ్రీధర్‌పై  పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. మంగళవారం ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు..సైదాబాద్‌ కాలనీ కరన్‌భాగ్, లక్ష్మీమనోహర్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన పొలిమేటి శ్రీధర్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ అలియాస్‌ అయ్యప్ప (49) గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ అక్రమాల్లో పాలు పంచుకునేవాడన్నారు. ఇతనిపై పహడీషరీఫ్, ఆదిభట్ల, వనస్థలిపురం, సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు హత్యలు, కిడ్నాప్‌లు, చీటింగ్, భూ కబ్జాలకు సంబందించి వివిధ పోలీస్‌ స్టేషన్లలో 8 కేసులుఉన్నాయన్నారు. 2016 సెప్టెంబర్‌ 2న పహడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో బెదిరింపుల కేసు నమోదైందన్నారు. 2013లో పీఎన్టీ కాలనీకి చెందిన ప్రభాకర్‌ని కిడ్నాప్‌ చేసి శ్రీశైలం అడవుల్లో హత్యచేసిన కేసులోనూ ఇ తను నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి పీడీ యాక్ట్‌ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు