ఇందుమతి కుటుంబానికి మంత్రి పీతల పరామర్శ

6 Mar, 2016 12:02 IST|Sakshi

ఏలూరు : ప్రమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఇందుమతి కుటుంబాన్ని మంత్రి పీతల సుజాత ఆదివారం పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులను మంత్రి పీతల సుజాత పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాల మీ కుటుంబాన్ని అదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ఇందుమతి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా పీతల సుజాత హామీ ఇచ్చారు. చట్టపరంగా నిందితులపై అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ఇందుమతి అనే యువతికి ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నారు. ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో ఆమెపై మరింత ఒత్తిడి తీసుకువచ్చాడు. దాంతో ఇందుమతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు సదరు యువకుడిని మందలించారు.

ఇందుమతితో చదువు మాన్పించారు. దీంతో ఆగ్రహించన సదరు ప్రేమికుడు .. శనివారం ఇందుమతిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుమతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు