‘భరోసా’తో క్రూర పరిహాసం

9 Feb, 2017 00:08 IST|Sakshi
‘భరోసా’తో క్రూర పరిహాసం
పింఛన్ల ప్రక్రియలో ‘పచ్చ’పార్టీ ‘కక్ష’తనం
జన్మభూమిని బహిష్కరించినందుకు శిక్ష
ఏజెన్సీలో ఐదు గ్రామాల్లో పంపిణీ నిలిపివేత
పశువుల్లంకలో పింఛన్‌ సొమ్ములో ఇంటిపన్ను కోత
 
ఒంటి సత్తువ ఉడిగి, కంటిచూపు క్షీణించిన వృద్ధులు, విధివంచితులైన వికలాంగులు, వితంతువులు ఎన్టీఆర్‌ భరోసా పేరుతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ కోసం తహతహతో ఎదురు చూస్తుంటారు. ఇచ్చే ఆ పింఛన్‌ మొత్తం కలిగిన వారు తమ బిడ్డలకు రోజువారీ జేబుఖర్చుకు ఇచ్చేంత కాకపోయినా ..అదే వారి చిరుజీవితాలకు కొండంత వెలుగు. జిల్లాలో ప్రతి నెలా నాలుగు లక్షల 75వేల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సామాజిక భద్రతా పింఛన్‌ తీసుకుంటారు. అయితే వారంతా పైన పేర్కొన్న అభాగ్యులూ, ఆ ఆసరాకు నూరు శాతం అర్హులేనా అంటే కొందరు కాదనే చెప్పాలి. కారణం అధికారపార్టీ నేతలు, జన్మభూమి కమిటీల నిర్వాకంతో  లబ్ధిదారుల ఎంపికలో పచ్చచొక్కాలకే ప్రాధాన్యం ఇవ్వడం. అంతేకాదు.. జన్మభూమి కమిటీల నిర్వాకంతో పింఛన్‌ లబ్ధిదారుల ఎంపికలో, పంపిణీలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. 
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో జన్మభూమిని బహిష్కరించినందుకు మన్యప్రాంతంలోని ఆరు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ నిలిపివేశారు. రాజవొమ్మంగి మండలంలో 19 పంచాయతీలుంటే అందులో లాగరాయి, లబ్బర్తి, తంటికొండ, వాతంగి, జడ్డంగి పంచాయతీల్లో పింఛన్‌ల పంపిణీని జన్మభూమి కమిటీలు చెప్పాయని అధికారులు అడ్డగోలుగా నిలిపివేశారు. ఆ గ్రామాల వారు వాల్మీకి కులస్తులకు కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, కిర్రాబువాగుపై ఆనకట్ట కట్టాలనే డిమాండ్‌లతో జన్మభూమిని బహిష్కరించడం అధికారపార్టీ నేతలకు, అధికారులకు తప్పుగా కనిపించింది. అవే కారణాలతో ఆ ఐదు గ్రామాల్లో మంజూరైన  సుమారు 120 పింఛన్‌లను నిలిపివేశారు. ఇందుకు భిన్నంగా పిఠాపురంలో పింఛన్‌ల కోసం బతికున్న వారిని చనిపోయినట్టుగా చూపించి, వారి భార్యలకు పింఛన్‌లు మంజూరుచేసి పంపిణీ చేసేశారు. సుమారు 22 మందిని పింఛన్‌ల కోసం రికార్డుల్లో మృతి చెందినట్టుగా చూపించారని తెలిసింది. ఈ పింఛన్‌లు అన్నీ తెలుగుతమ్ముళ్ల ఆధ్వర్యంలో ఏర్పాౖటెన జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసినవే కావడం గమనార్హం. 
అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం సాకుతో.. 
అధికారపార్టీ నేతల మాదిరిగానే క్షేత్రస్థాయిలో పింఛన్‌లు పంపిణీచేసే కొందరు ఉద్యోగులు కూడా కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కుడిచేత్తో పింఛన్‌లు ఇచ్చి ఎడమచేత్తో పన్నుల రూపంలో తిరిగి లాగేసుకుంటున్నారు. ఏడెనిమిది నెలల క్రితం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో తెలుగుతమ్ముళ్లు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ విగ్రహాల ఏర్పాటు కోసం పింఛన్‌ల సొమ్ము నుంచి సగం సొమ్మును బలవంతంగా లాగేశారు. ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గంలో పంచాయతీ ఉద్యోగులు పింఛన్‌ల సొమ్ము నుంచి ఇంటి పన్నులు జమ చేసుకుంటూ వికృతంగా వ్యవహరిస్తున్నారు. ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో ఈ దురన్యాయం చోటు చేసుకుంటోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి పశువుల్లంక పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి పింఛన్‌లు పంపిణీ చేస్తున్నారు. పింఛన్‌ల కోసం వస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్‌ ఇలా ఇచ్చి అలా అదే సొమ్ము నుంచి ఇంటి పన్నును మినహాయించేసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఆ పంచాయతీలో పింఛన్‌ల సొమ్ము నుంచి ఇంటి పన్నులను పంచాయతీ గుమాస్తా, సిబ్బంది మూటగట్టుకుపోతున్నారు. 
అడిగితే అసలుకే మోసమని..
పింఛన్‌ల కోసం వెళుతుంటే ఇంటి పన్నులు చెల్లించాలంటూ రూ.300, రూ.400 వంతున సొమ్ము మినహాయించుకుంటున్నారని వృద్ధులు, వితంతువులు ఆవేదన చెందుతున్నారు. అదేమని గట్టిగా అడిగితే పింఛన్‌ ఎక్కడ లేకుండా చేస్తారనే భయంతో వారు మారుమాటాడకుండా ఇచ్చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు పంచాయతీలో ఇంటి పన్ను ఉన్న అందరి దగ్గర నుంచీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏ పంచాయతీ అయినా ఇంటి పన్ను వసూలు చేయాలంటే ముందు ఇంటి యజమానికి డిమాండ్‌ నోటీసు ఇవ్వాలి. ఇచ్చిన 10 రోజుల తరువాత పన్ను వసూలుకు వెళ్లాలి.అటువంటి ప్రక్రియ ఏమీ లేకుండానే ‘కడుపులో నీళ్లు కదలకుండా..’ అన్న సామెత మాదిరిగా పంచాయతీ కార్యాలయం వద్దే పింఛన్‌ల సొమ్ము నుంచి పన్ను వసూలుకు తెగబడటం విస్మయాన్నీ, ఏహ్యతనూ కలిగిస్తోంది. పశువుల్లంకలో ఇంటి పన్ను ఏడాదికి రూ.3లక్షల 19వేలు కాగా ఇందులో ఇప్పటి వరకూ 40 శాతం పన్ను వసూలు చేశారు. జిల్లా యంత్రాంగం స్పందించి ఈ తరహా బలవంతపు వసూళ్లను నియంత్రించాల్సి ఉంది.
 
మరిన్ని వార్తలు