ప‌చ్చ‌ని ప‌ల్లెలో మ‌ద్యం మంట‌లు

17 Jul, 2017 04:52 IST|Sakshi
ప‌చ్చ‌ని ప‌ల్లెలో మ‌ద్యం మంట‌లు
మద్యం షాపు వద్దంటూ ఆందోళన
షాఫు ధ్వంసం, షాపు యజమాని దాడి
వైఎస్సార్‌ సీపీ నేత చిట్టిబాబు సహ పలువురికి గాయాలు
రాస్తారోకోలు, ధర్నాలతో తీవ్ర ఉద్రిక్తత

 
ముమ్మిడివరం : మండలంలోని అయినాపురంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఆదివారం మద్యం షాపును అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామస్తులపై షాపు యజమాని అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీసీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబుతో పాటు పలువురికి బలమైన గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు కోపోద్రిక్తులై మద్యం షాపుపై దాడి చేశారు. గ్రామస్తులపై అనుచరుడితో కలిసి షాపు యజమాని దాడి చేయగా, పోలీసు స్టేషన్‌లో వారితో టీడీపీ నాయకులు ఉండడం సమస్య మరింత తీవ్రమైంది.
 
షాపు వద్దని పంచాయతీ తీర్మానం చేసినా... 
జూలై 29న గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని కోరుతూ అయినాపురం çపంచాయతీలో తీర్మానం చేసి ఎక్సైజ్‌ జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు అందజేశారు. అధికారులు అనుమతి ఇవ్వడంతో ఆదివారం షాపు యజమాని అయినాపురంలో షాపును ప్రారంభించారు. దీంతో సర్పంచ్‌ మట్టపర్తి సత్యకుమారి, మాజీ సర్పంచ్‌ పెయ్యల భూలక్ష్మి, వందలాది మంది మహిళలు, గ్రామస్తులు మద్యం షాపు వద్ద ఆందోళనకు దిగారు. 
 
మూసివేతకు యత్నం...
షాపును మూసి వేయడానికి ప్రయత్నించిన మహిళలపై షాపు యజమాని మట్టా సూరిబాబు(పండు), అనుచరుడు వెల్లిగట్ల సుధీర్‌ ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబుకు, కాట్రు శ్రీనివాసరావుకు తలపై బలమైన గాయాలయ్యాయి. పంతగడ సత్యనారాయణకు చేతులపై గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు షాపు ఎదుట రోడ్డుపై బైఠాయించారు. షాపు మూసి వేసి దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వారు ముమ్మిడివరం పోలీసుస్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్కడ హైవేపై రాస్తారోకో చేశారు. 144 సె‍క‌్షన్‌ అమలులో ఉన్నందున ఆందోళన విరమించాలని సీఐ కేటీవీవీ రమణారావు వారిని కోరారు. నిందితులను అరెస్ట్‌ చేసేవరకు ఆందోళన విరమించమంటూ వాహనాలు అడ్డుకున్నారు. గంటలోగా నిందితులను అరెస్టు చేస్తామని సీఐ హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాడి చేసిన ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
పోలీసుస్టేషన్‌లో నిందితులతో టీడీపీ నేతలు..
విషయం తెలుసుకున్న దళిత నాయకులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారు తిరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకునేసరికి.. స్టేషన్‌లో నిందితులతోపాటు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు స్టేషన్‌లో ఉండడంతో అభ్యం తరం తెలిపారు. నిందితులకు స్టేషన్‌లో రాచమర్యాదలు చేస్తున్నారని, టీడీపీ నేతలకు ఇక్కడ పనేంటంటూ పోలీసులను ప్రశ్నించారు. ఒక దశలో వారు స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. చివరికి టీటీపీ వారిని పోలీసులు బయటకు పంపడంతో ఆందోళన విరమించారు. 
 
ఎక్సైజ్‌ సీఐ కార్యాలయం వద్ద...
అనంతరం వారు ఎక్సైజ్‌ సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినాపురంలో మద్యం షాపు లైసెన్స్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మద్యం సిండికేట్ల వద్ద లంచాలు తీసుకుని బెల్టు షాపులకు అనుమతులిస్తున్నారని విరుచుకు పడ్డారు. ఎక్సైజ్‌ ఎస్సై స్వామిరెడ్డి వారిని బుజ్జగించినా వారు శాంతించలేదు. సీఐ రావాలని షాపు లైసెన్స్‌ రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో ఎస్సై స్వామిరెడ్డి సెల్‌లో సీఐతో వైఎస్సార్‌ సీపీ నేత చిట్టిబాబుతో మాట్లాడించారు. గ్రామస్తుల అ«భ్యర్థనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి షాపు మూసి వేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

షాపుపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు షాపు యజమాని సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది గ్రామస్తులపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకా రామారావు, కాట్రు అప్పారావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, అమరా శ్రీను, మట్టా చిరంజీవి, జొన్నాడ నాగేశ్వరరావు, ఏఎస్‌వీ సుబ్బారావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు కాశి బాలమునికుమారి, జనిపెల్ల బాలశ్రీనివాసరావు, కుడిపూడి శ్రీనివాసరావు, దళిత నాయకులు పామురాజేంద్రప్రసాద్, చీకురుమిల్లి శ్రీనివాసరావు, దేవరపల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు