కడుపునొప్పితో వ్యక్తి ఆత్మహత్య

31 Jul, 2016 17:47 IST|Sakshi

శంషాబాద్‌ రూరల్‌: కడుపునొప్పి బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని రామంజాపూర్‌లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివగారి రాజు(28) డ్రైవింగ్‌తోపాటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తాగుడుకు బానిసైన ఇతను తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు.

          ఈక్రమంలో గతనెల 24న భార్య లక్ష్మి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని కిషన్‌నగర్‌లో పుట్టింటికి బోనాల పండగకు వెళ్లింది. శనివారం రాత్రి తిరిగి కడుపునొప్పి ఎక్కువ కావడంతో బాధ భరించలేని రాజు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం గమనించిన కుటుంబసభ్యులు కిందికి దించి చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. అయితే, రాజు ఆత్మహత్య విషయం బయటకు పొక్కకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుండగా.. మధ్యాహ్నం శంషాబాద్‌ పోలీసులకు సమాచారం అందడంతో గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహానికి స్థానిక క్లష్టర్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి భార్య లక్ష్మి, రెండేళ్ల కొడుకు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు