జీజీహెచ్‌లో జూడాల ఆందోళన ఉధృతం

30 Oct, 2016 04:42 IST|Sakshi
జీజీహెచ్‌లో జూడాల ఆందోళన ఉధృతం

ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసే వరకు ఆందోళన ఆపేది లేదన్న జూడాలు
సాక్షి, గుంటూరు: పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. శుక్రవారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించి జూడాలు సమ్మె కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాని నినాదాలు చేశారు.

మరోవైపు ప్రొఫెసర్ లక్ష్మి జాడ వారం నుంచి తెలియకపోవడంతో పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరుగుతోంది. జూడాలు అత్యవసర విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు కూడా గంటపాటు వీరికి మద్దతుగా నిలవడంతో  ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం నుంచి పారా మెడికల్ సిబ్బంది కూడా జూడాలకు మద్దతు తెలియజేస్తామనడంతో జీజీహెచ్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

అర్బన్ ఎస్పీ చర్చలు: గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు వేర్వేరుగా జూడాలతో సమావేశమై చర్చలు జరిపారు. అయినా జూడాలు సమ్మె విరమించేది లేదని, అత్యవసర వైద్య సేవలకు సైతం హాజరుకాబోమని తేల్చి చెప్పారు. వారి ఆందోళనకు వైఎస్సార్‌సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మద్దతు తెలిపారు.

>
మరిన్ని వార్తలు