భూమాయ!

12 Mar, 2016 01:55 IST|Sakshi

ఫార్మా భూసేకరణలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం
మీర్‌ఖాన్‌పేటలో రికార్డులు తారుమారు పహణీల్లో తప్పుడు నమోదులు..

అక్రమాలకు పాల్పడిన వీఆర్‌ఓలు సస్పెండ్ చేస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం

 ఔషధనగరి భూసేకరణలో రెవెన్యూ యంత్రాంగం హస్తలాఘవం ప్రదర్శించింది. తప్పుడు రికార్డులు సృష్టించడం ద్వారా పరిహారం కైంకర్యం చేసేందుకు ప్రయత్నించింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం.112లో జరిగిన భూమాయపై విచారణ జరిపిన జిల్లా యంత్రాంగం.. ఇద్దరు ఇంటి దొంగలపై వేటు వేసింది. ఇదే అంశంపై గత నెల 26న ‘లెక్కతప్పింది’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన యంత్రాంగం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది.  - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీకి వేలాది ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులోభాగంగా మీర్‌ఖాన్‌పేట సర్వే నం. 112లోని 613 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు భూముల సర్వే చేసిన అధికారులు లెక్క తేలిన విస్తీర్ణం చూసి బిత్తెరపోయారు. తొలుత 2008-09, 2012-15 పహణీల ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ లెక్క కాస్తా 691 ఎకరాలు తేలింది. వెలుగు చేసిన అక్రమాలపై మరింత లో తుగా దర్యాప్తు జరిపిన రెవెన్యూ యం త్రాంగం మొత్తం విస్తీర్ణం కంటే అదనంగా 343 ఎకరాలు ఉన్నట్లు గుర్తిం చింది. ఈ భూ బాగోతం వెనుక గ్రామ రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషిం చినట్లు నిర్ధారణ అయ్యింది. పహణీల్లో తప్పుడు నమోదు ద్వారా కొందరు నకిలీలు భూసేకరణ పరిహారాన్ని కాజేయాలని ఎత్తుగడ వేసినట్లు స్పష్టమైంది. వాస్తవ విస్తీర్ణకంటే ఎక్కువగా ఉన్నట్లు కొందరు తమ పేర్లను రికార్డుల్లో నమోదు చేయించుకున్నట్లు తేటతెల్లమైంది.

 అక్రమార్కులతో వీఆర్‌ఓల మిలాఖత్!
ఇటీవల ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా గ్రామానికి వెళ్లిన రెవెన్యూ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికిగాకుండా... పహణీల్లో ఉన్న విస్తీర్ణానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ రావడంతో యం త్రాంగం విస్తుపోయింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికార్డులపై అనుమానం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ 112 సర్వే నంబర్‌లోని మొత్తం పహణీలను నిశితంగా పరిశీలించాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ మేరకు సర్వే ల్యాండ్ రికార్డ్స్, మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, వీఆర్‌ఓతో కలిసి మీర్‌ఖాన్‌పేట భూముల వ్యవహారంపై లోతుగా విచారించారు. దీంతో అక్రమాల డొంక బయటపడింది. 1989-90 నుంచి ఇప్పటివరకు ప్రతి రికార్డును పరిశీలించిన అధికారులు.. ఈ భూ బాగోతం వెనుక గతంలో పనిచేసినవీఆర్‌ఓల పాత్ర ఉన్నట్లు నిగ్గు తేల్చారు. ఎలాంటి రుజువులు, సాక్ష్యాలు లేకుండానే పహ ణీ పట్టాకాలమ్‌లలో పేర్లను నమోదుచేసినట్లు గుర్తించారు. గతంలో ఇక్కడ వీఆర్‌ఓలుగా పనిచేసిన డి.లక్ష్మీ నర్సిములు, డి.రవీందర్, ఏ.రాములు (చనిపోయారు), పి.రాములు (రిటైర్డ్), జే.శ్రీనివాసులు, కె.నర్సింహ రెవెన్యూ రికార్డులను తారుమారు చే శారని, వీరిరువురిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు సిఫారసు చేశారు. ఈ మేరకు జేసీ-1 రజత్‌కుమార్ వీఆర్‌ఓలు శ్రీనివాసులు, నర్సింహ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది.

కుర్మిద్ద ‘ఫార్మా’ భూమి రీసర్వేకు ఆదేశం
యాచారం : ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్న కుర్మిద్దలో గల సర్వే నంబరు 311లోని భూమిని రీ సర్వే చేయాలని జేసీ రజత్‌కుమార్ సైనీ ఆదేశించారు. ఈ సర్వే నంబరులో సాగుకు యోగ్యమైన భూమి తక్కువగా ఉండడం, పరిహారం కోసం పలువురు రైతులు నకిలీ పట్టాదారు, పాసు పుస్తకాలు సృష్టించి, అధిక విస్తీర్ణంలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి 311 సర్వే నం బరులో మొత్తం భూమి 375 ఎకరాలు ఉండగా ఇందులో 213 ఎకరాలు అసైన్డ్ చేయడం జరిగింది. ఈ భూమిలో దాదాపు 30 నుంచి 40 ఎకరాల వరకు సాగుకు యోగ్యంగా లేకపోవడంతో పలువురు దీనిని వదిలేసి వెళ్లారు. మిగతా 13 ఎకరాల్లో తండా, రెండెకరాల్లో రోడ్డు నిర్మాణం ఉంది. కందుకూరు, యాచా రం మండలాల సరిహద్దులో 124 ఎకరాల్లో గుట్ట ఉంది. అసైన్డ్ చేసిన భూమి కంటే ఎక్కువ భూమిలో పట్టాదారు, పాసుపుస్తకాలు, కబ్జాలో ఉన్నట్లు ఫిర్యాదు నేపథ్యంలో రీ సర్వేకు జేసీ ఆదేశించినట్లు తెలిసింది. ఈ సర్వే నంబరులోనే  2005-06లో,  2009-10లో 54 మంది నకిలీ సర్టిఫికెట్లు, పట్టాదారు, పా సుపుస్తకాల సృష్టించి, బ్యాంకుల్లో పంట రుణాలు పొందినట్లు వెలుగులోకి రావడంతో సంబంధిత వ్యక్తులపై కేసులు కూ డా నమోదు చేశారు. దీంతో సోమ, మం గళవారాల్లో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో రీసర్వే  చేయనున్నట్లు సమాచారం.

 

మరిన్ని వార్తలు