10న పైలేరియా నివారణ మందుల పంపిణీ

4 Aug, 2016 00:04 IST|Sakshi
ఎంజీఎం : జిల్లాలో పైలేరియా అధికంగా ఉన్న 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న 8,28,260 మందికి ఈ నెల 10న ఇంటింటికీ తిరుగుతూ మాత్రలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. బుధవారం టీఎన్జీవోస్‌ భవన్‌లో 17 పీహెచ్‌సీల పరిధిలోని ఎస్పీహెచ్‌ఓలు, వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్‌ అధికారులు, హెచ్‌ఈఓలు, సబ్‌ యూనిట్‌ అధికారులు, హెల్త్‌సూపర్‌వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  పీహెచ్‌సీల పరిధిలో ఉన్న 5623 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులతో మిగతా వారికి ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సాముహిక మాత్రల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ వ్యాధిగ్రస్తులలో 1/3 మంది భారతీయులేననన్నారు. వ్యాధి నివారణ కోసం 2004 నుంచి సామూహిక మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో జోనల్‌ మలేరియా అధికారి జయశ్రీ, జిల్లా మలేరియా అధికారి పైడిరాజు,  లక్ష్మణ్, సీనియర్‌ ఎంటమాలజిస్టు రమణమూర్తి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, ఎస్పీహెచ్‌ఓలు రామ్మోహన్, సుధీర్, రామారావు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు