పట్టుకునే దమ్ముందా?

13 May, 2016 16:24 IST|Sakshi
పట్టుకునే దమ్ముందా?

- పోలీసులకు పైరసీ సీడీ మాఫియా సవాల్
- చిన్న వ్యాపారులను పట్టుకుని పైరసీ డాన్‌లను వదిలేస్తున్న వైనం
- నెల్లూరులో లక్షల్లో పైరసీ సీడీల విక్రయాలు
- టూ టౌన్, త్రీ టౌన్ ఐడీ పార్టీ పోలీసుల సహకారం

 
 పైరసీ సీడీల వ్యాపారానికి జిల్లా అడ్డాగా మారింది. పోలీసుల సహకారంతో జరుగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఫిల్మ్ చాంబర్ దాడులు మొదలు మొత్తం సమాచారాన్ని అక్రమార్కులకు పోలీసులే చేరవేస్తున్నారు. దీంతో నెలకు లక్షల్లో పైరసీ సీడీల వ్యాపారం జోరుగా సాగుతోంది. ముగ్గురు వ్యక్తులు అటు పోలీసులను, ఇటు నేతలను తమ చేతుల్లో పెట్టుకుని పైరసీ సీడీల వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

 

 బుచ్చిరెడ్డిపాళెం : నెల్లూరు జిల్లా కేంద్రమైన పట్టణంలోని ఆనంవారి వీధిలో పైరసీ సీడీల వ్యాపారం ఏళ్ల తరబడి జోరుగా సాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి సీడీ దుకాణాల వ్యాపారులు పైరసీ సీడీలు కొని తీసుకెళుతుంటారు. ఒక్కో సీడీని రూ.30కు విక్రయిస్తున్నారు. వీటిని మండల కేంద్రాల్లోని దుకాణాల్లో రూ.50 కు అమ్మకాలు జరుపుతుంటారు. సుకుమార్, సుబ్రహ్మణ్యం, రత్నం అనే వ్యక్తులు ప్రధానంగా పెద్దస్థాయిలో పైరసీ సీడీల వ్యాపారం సాగిస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం.
 
 జనవరిలో పరారైన అక్రమార్కులు
జిల్లాలో జరుగుతున్న పైరసీ సీడీల దందాపై హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌కు సమాచారం అందింది. అక్కడి నుంచి సంబంధిత అధికారులు జిల్లాకు చేరుకున్నారు. సదరు ముగ్గురు వ్యక్తులపై ఆరా తీశారు. అయితే స్థానిక పోలీసులతో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు దాడుల గురించి తెలుసుకుని భార్యా పిల్లలతో సహా ఇంటిని విడిచి పరారయ్యారు. కొంతకాలం రహస్యంగా గడిపారు. తమకు తెలిసిన నేతలు, పోలీసులతో బేరసారాలు చేశారు. విషయం బయటపడకుండా సద్దు మణిగించారు. దీంతో ఫిల్మ్ చాంబర్ అధికారులు వెనక్కి తిరిగారు.

 పోలీసులకు తెలిసినా..
ఆనంవారి వీధిలో జరిగే ఈ పైరసీ దందా బాగోతం సంబంధిత మూడో నగర పోలీసులకు తెలుసు. అయినా ఏ నాడూ పోయి దాడులు చేసిన పాపాన పోలేదు. దాడులు చేయకపోవడమే కాదు. ఎవరైనా దాడులు చేసేందుకు స్థానిక పోలీసుల సహకారం కోరినా ఆ సమాచారాన్ని వెంటనే వారికి చేరవేస్తారు. తాజాగా విడుదలైన సుప్రీమ్, సరైనోడు చిత్రాల పైరసీ సీడీలు ఆనం వారి వీధిలో పట్టపగ లు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం.

తిమింగలాలను వదిలి... చిన్నచేపలను పట్టి
 ఆనంవారివీధిలో వ్యాపారం చేసే వారి నుంచి పైరసీ సీడీలు తెచ్చుకుని అమ్ముకుంటున్న వ్యాపారులపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. నెల్లూరు రూరల్ , కొడవలూరు తదితర ప్రాంతాల్లో కేసులు సైతం నమోదు చేశారు. వాస్తవానికి వీరి తెరవెనుక ఉన్న పైరసీ డాన్‌ల గుట్టురట్టు చేయలేకపోయారు.

 రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నా జిల్లాలో శూన్యం
రాష్ట్రంలోని అనంతపురంలో రామకృష్ణను, ఒంగోలులో సందాని, గుంటూరులో పూర్ణ, రైల్వేకోడూరులో రవి, ఏలూరులో సునీల్, రాముడు, విజయవాడలో భాస్కర్‌రావు, వైజాగ్‌లో రాజేష్‌ను పైరసీ సీడీల కేసులో ఫిల్మ్‌చాంబర్, స్థానిక పోలీసులు పట్టుకుని వారిని కటకటాల్లోకి పంపారు. నెల్లూరులో మాత్రం పైరసీని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. పైరసీ డాన్‌లకు సహకరిస్తున్న ఐడీ పార్టీ పోలీసుల సెల్‌ఫోన్ డేటాను వెలికితీస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. జనవరిలో జరిపిన లావాదేవీలు, సంభాషణలు బయటకు వస్తే పోలీసుల అవినీతి గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఎస్పీ విశాల్‌గున్నీ పైరసీని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 పైరసీ జరుగుతోందిలా..

 సినిమా విడుదలైన రోజే సుకుమార్, సుబ్రహ్మణ్యం, రత్నం తిరుపతికి చెందిన భాస్కర్, మైసూరు, బెంగళూరుకు చెందిన కృష్ణారెడ్డి, వెంకటేష్‌లు సినిమాను ఫైల్ జిల్లా, జీమెయిల్ తదితర సాఫ్ట్‌వేర్ల ద్వారా పంపుతున్నట్లు సమాచారం. నెల్లూరుకు చెందిన ముగ్గురు వాటిని డౌన్‌లౌడ్ చేసుకుని డంపర్ల ద్వారా కాపీలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన కలర్‌పోస్టర్‌ను చెన్నై ద్వారా తెచ్చుకుంటారు. వాటిలో సీడీలను ఉంచి విక్రయాలను జరుపుతున్నారు. సినిమాను పంపుతున్న ముగ్గురు వ్యక్తులు పైరసీ సీడీల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు