నిజాంసాగర్ : హరితహారం కార్యక్రమంలో బాగంగా ఉపాధి హామీ ద్వారా 1.7 కోట్ల మొక్కలు నాటామని జిల్లా ఉపాధి హామీ ప్లాంటే షన్ అధికారి గంగాధర్ తెలిపారు. హరితహారం కింద నాటిన మొక్కలకు సంబంధించి వారం రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లిస్తామన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హరితహారం కింద జిల్లాలో 2.7 కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 1.7 కోట్లు, మిగితావి సోషల్ ఫారెస్టు, అటవీశాఖల ఆధ్వర్యంలో నాటించినట్లు తెలిపారు. నిజాంసాగర్, బీర్కూర్, బాన్సువాడ, నిజామాబాద్, డిచ్పల్లి, కోటగిరి, కామారెడ్డి, వర్ని మండలాల్లో వందశాతం మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో లక్ష్యాన్ని మించిన మొక్కలు నాటడంతో డబ్బుల చెల్లింపునకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈజీఎస్ ద్వారా నాటిన మొక్కలకు ఇప్పటి వరకు రూ. 20 లక్షల వరకు డబ్బులు కూలీలకు చెల్లించామని తెలిపారు. సమావేశంలో జిల్లా సోషల్ ఆడిట్ అధికారులు భూమేశ్వర్, బుచ్చయ్య, ఎంపీడీవో రాములు నాయక్, ఈజీఎస్ ఏపీవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.