గుళ్లు కూల్చినందుకు క్షమించండి

6 Aug, 2016 11:45 IST|Sakshi
గుళ్లు కూల్చినందుకు క్షమించండి
స్వామీజీలను కలిసిన మంత్రి మాణిక్యాలరావు
సాక్షి, అమరావతి : 
విజయవాడ నగరంలో కూల్చిన మూడు ఆలయాలకు రాజీవ్‌గాంధీ పార్క్‌లో స్థలం కేటాయిస్తున్నట్లు దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టీడీపీ ప్రభుత్వం ఇటీవల నగరంలోని ఆలయాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ స్వామీజీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయాలను పునర్మించటం, కలెక్టర్, మున్సిపల్‌ కమిషనర్, పుష్కరాల ప్రత్యేకాధికారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామీజీల డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇవ్వటంతోపాటు పుష్కరాలు ప్రారంభానికి ముందే కూలగొట్టిన ఆలయాలను పునర్మిస్తామని హామీ ఇచ్చారు.

అయితే నెలరోజులు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేరకపోవటంతో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ధర్మకర్త, స్వామీజీ శ్రీ జమునాదాస్, çశృంగేరి పీఠాధిపతి సచ్చిదానంద తీర్థస్వామి అలంకార్‌ సెంటర్‌లో నిరాహారదీక్ష చేపట్టారు. వీరితోపాటు ఎల్లాప్రగడ విజయలక్ష్మి, బెహరా చందన్‌ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనను విరమింపజేసేందుకు దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. శ్రీరామాలయం, శ్రీఅభయాంజనేయస్వామి, శనేశ్వరాలయాల నిర్మాణానికి నగరంలోని రాజీవ్‌గాంధీ పార్క్‌లో స్థలం కేటాయించనున్నట్లు స్వామీజీలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ఆలయాల కూల్చివేతకు ప్రభుత్వం తరుపున క్షమాపణలు కోరారు. ఇకపై ఆలయాలను తొలగించాల్సి వస్తే స్వామీజీలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నిరసన చేస్తున్న స్వామీజీలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
మరిన్ని వార్తలు