‘పోలవరం’ పనులు ప్రాణాంతకం

12 Dec, 2016 14:41 IST|Sakshi
‘పోలవరం’ పనులు ప్రాణాంతకం
కుమ్మరిలోవ కాలనీపై పడిన కాలువ బండరాళ్లు
తృటిలో తప్పిన పెనుప్రమాదం
ఆందోళనలో స్థానికులు 
తాత్కాలికంగా పనులు నిలిపివేత
తునిరూరల్‌ : తుని మండలం కుమ్మరిలోవ కాలనీని ఆనుకుని ఉన్న కొండపై నుంచి తాండవ నదిమీదుగా నిర్మించనున్న పోలవరం ఎడమ కాలువ అక్విడెక్ట్‌ పనులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలు వెళ్లేందుకు వీలుగా కొండపై రహదారి ఏర్పాటు చేస్తుండగా మంగళవారం బండరాయి అదుపు తప్పి కిందకు దొర్లివచ్చింది. ఈ బండరాయి కొండ దిగువన ఉన్న గోగాడ పైడితల్లి ఇంటి ప్రధాన గోడను ధ్వంసం చేసింది. ఈ ఘటనతో తమ వంటింట్లో సామాన్లు ధ్వంసమయ్యాయని బాధితురాలు బుధవారం వాపోయింది. పాఠశాల నుంచి పిల్లలు రాకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని, వారు వచ్చుంటే ఆ ప్రాంతంలోనే ఆడుకునేవారని ఆందోళన వ్యక్తం చేసింది. 20 అడుగులు ఎత్తునుంచి ఈ బండరాయి పడిందని, కాంట్రాక్టర్‌ సిబ్బంది వచ్చి పరిశీలించి పనులు నిలిపివేసినట్టు ఆమె వివరించింది. పగుళ్లిచ్చిన ఇంటి గోడ, బండరాయిని ఆమె విలేకరులకు చూపించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఎవరూ లేరు. ఇటీవల పనులు చేసేందుకు పీఎస్‌కె, హెచ్‌ఈఎస్‌ (జాయింట్‌ వెంచర్‌)కు అప్పగించారు. కాలనీ ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా నష్టపరిహారం ఇవ్వలేదని, పనులు చేస్తున్నట్టు కనీస సమాచారం ఇవ్వలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించగానే పనులు నిలిపివేశారన్నారు. ప్రాథమిక పనులు చేస్తేనే తీవ్రత ఇలా ఉంటే ప్రధాన పనులు చేస్తే ఏవిధంగా ఉంటుందోనని స్థానికులు భీతిల్లుతున్నారు.
మరిన్ని వార్తలు