ఆ రోజు ఏం జరిగింది.?

16 Nov, 2016 04:23 IST|Sakshi
ఆ రోజు ఏం జరిగింది.?

– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసుల మూకుమ్మడి దాడిపై విమర్శలు
– ఆయనపై చర్యలు ఓకే.. మరీ దాడి చేసిన పోలీసులపై..?


అనంతపురం సెంట్రల్‌ : నగదు మార్పిడి కోసం ఈనెల 13న సాయినగర్‌ స్టేట్‌బ్యాంకు వద్దకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసుల మూకుమ్మడి దాడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసలు ఆరోజు ఏమైంది.? తొలుత తప్పు చేసింది ఎవరు? తప్పు చేసిన వారికి శిక్షలు ఉండవా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం మండలానికి చెందిన మాధవరెడ్డి స్థానిక ఎస్కేయూ క్యాంపస్‌లో భారత వాతవరణ పరిశోధన కేంద్రంలో టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయన డబ్బుల కోసం తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 13న సాయినగర్‌ స్టేట్‌ బ్యాంకు వద్దకు వచ్చారు. ఆ సమయంలో టూటౌన్‌ ఎస్‌ఐ జనార్దన్‌ అనుచితంగా మాట్లాడడంతో మాధవరెడ్డి కోపోద్రిక్తుడైనట్లు సమాచారం.

ఈ ఘటనలో తొలుత పోలీసులదే తప్పు అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ దుస్తుల్లో ఉండే వ్యక్తి పోలీసులపై చేయి చేసుకోవడం అసంభవం. అలాంటిది ఏకంగా ఎస్‌ఐపైనే దాడి చేశాడంటే అంతకుముందు ఏం జరిగింటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  నిమిషాల్లో ఈ ఘటన జరిగిపోయింది. అసలు ఏం జరిగిందనే అంశం కూడా ఎవరికీ తెలియకుండా పోలీసులంతా అతడిని గొడ్డును బాదినట్లు బాదుకుంటూ తీసుకుపోయారు. ఆ తర్వాత ప్రయత్నించినప్పటికీ మీడియా కాదు కదా ఆయన భార్యను కూడా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు. ‘మా ఆయన ఎస్‌ఐను కొట్టాడని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కొట్టి ఉండరు. ఆయన మధుస్వభావి. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలపడం లేదు. అంటూ ఘటన జరిగిన రోజు మాధవరెడ్డి భార్య కన్నీంటి పర్యంతమయ్యారు.

అంతా ఏకపక్షం
ఈ ఘటనలో పోలీసులంతా ఏకమై ఏకపక్షంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్రీటౌన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ అయితే ఆవేశంతో ఊగిపోయారు. ఆ కొట్టడం చూస్తే  గొడ్డును కూడా ఆ స్థాయిలో కొట్టరేమో అనక మానరు. ఆయన ఆ విధంగా రెచ్చిపోయారు. ఇది కేవలం వందలాది మంది ప్రజల సమక్షంలోనే. స్టేషన్‌లో రెండు రోజుల పాటు కస్టడీలో పెట్టుకున్న పోలీసులు కౌన్సిలింగ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటనలో బాధితుడి నుంచి  ఫిర్యాదు తీసుకోరా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డిపై మాత్రం మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  స్టేషన్‌ బెయిల్‌పై ఆయనను సోమవారం విడుదల చేసినట్లు సమాచారం.

విచారణ చేస్తున్నాం
 సాయినగర్‌ స్టేట్‌ బ్యాంకు వద్ద జరిగిన ఘటనపై విచారణ బాధ్యతలు నాకు అప్పగించారు. అసలు ఆ రోజు జరిగిందనే విషయంపై లోతుగా ఆరా తీస్తున్నాం. త్వరలో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. -  నరసింగప్ప, డీఎస్పీ, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌

ఇద్దరిదీ తప్పే
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం జరిగిన ఘటనలో ఇరువర్గాల వారిది తప్పు ఉంది. సహనం కోల్పోయి ఎస్‌ఐపై దురుసుగా వ్యవహరించడం మాధవరెడ్డి అనే వ్యక్తి తప్పు అయితే ఆ రకంగా పోలీసులంతా కలిసి చితకబాదడడం భాధాకరం, మాధవరెడ్డిపై పోలీసులు ఏ కేసు నమోదు చేస్తారో.. పోలీసులపై కూడా అవే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. - హరినాథ్‌రెడ్డి, పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది

మా ఆయన అలాంటి వాడు కాదు
మేము ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే. డబ్బులు అవసరమున్నా నాలుగురోజుల నుంచి బ్యాంకు వద్దకు వెళ్లలేదు. అత్యవసరం కావడంతో ఆదివారం వెళ్లాడు.  ఏమైందో ఏమో తెలియదు. ఎస్‌ఐను కొట్టాడని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కొట్టి ఉండడు. నా భర్త మృధు స్వభావి. -  మాధవరెడ్డి భార్య

మరిన్ని వార్తలు