పోలీస్ కమిషనర్ యూ టర్న్!

9 Dec, 2015 09:24 IST|Sakshi
పోలీస్ కమిషనర్ యూ టర్న్!

విజయవాడ సిటీ : ‘మద్యం షాపుల వేళలు కచ్చితంగా పాటించాలి. ఇందుకు విరుద్ధంగా జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తాను. తెలియకుండా జరిగితే మరోసారి జరగకుండా హెచ్చరికలు ఉంటా యి. అధికారులకు తెలిసే మద్యం అమ్మకాల వేళలు పాటించడం లేదని గుర్తిస్తే ఇంటికి వెళ్లడమే..’ అంటూ నాలుగు నెలల కిందట నగర పోలీస్ కమిషనర్ దామోదర గౌతమ్ సవాంగ్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సమయంలో హెచ్చరించారు.
 
అంతే అధికారుల సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే తమ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపులపై నిబంధనల కొరఢా ఝుళిపించారు. బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, మద్యం షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరపాలంటూ ఆదేశించారు. పావుగంట ఆలస్యమైనా సిబ్బందిని స్టేషన్లకు తరలించి కఠిన చర్యలు తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో బెల్టు షాపులు గుర్తిస్తే సంబంధిత షాపులు సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు. పది రోజుల పాటు అంతా సీపీ ఆదేశించినట్టే జరిగింది.
 
 ఆ తరువాత..
 ఏం జరిగిందో కానీ వేళలు పాటించడం బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు మానేశారు. పాత పద్ధతిలోనే వ్యాపారం జరిగింది. రాత్రి 12 గంటల వరకు అమ్మకాలు జరిపిన నిర్వాహకులు ఆ తర్వాత ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి మరీ అమ్మారు. ఉదయం 6 గంటల నుంచే షట్టర్లు తీసేసి మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నా పోలీసు అధికారులు చూసీచూడనట్టుగా వదిలేశారు.  ఇందుకు సహకరించినందుకు గానూ పోలీసులకు గతంలో రూ.15 వేలు నెలవారీ మామూళ్లు ఇచ్చిన మద్యం వ్యాపారులు ఇప్పుడు రూ.20 వేలు, అమ్మకాలను బట్టి అంతకంటే ఎక్కువే ఇస్తున్నట్లు తెలుస్తోంది.  
 
 ఆంతర్యమేంటి?..
 బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ దందాపై ఉక్కుపాదం మోపిన పోలీస్ కమిషనర్ పది రోజుల వ్యవధిలోనే యూ టర్న్ తీసుకోవడం వెనుక ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణంగా తెలుస్తోంది. ఇసుక, మద్యం దందా నిర్వహణలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతలకు ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. రెట్టింపు లాభాలు రుచిమరిగిన తెలుగు తమ్ముళ్లకు సీపీ సవాంగ్ నిర్ణయం ఏమాత్రం రుచించలేదు. అంతే ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిళ్లు తెచ్చి సీపీ నిర్ణయాన్ని మార్చుకునే విధంగా చేశారనేది కమిషనరేట్ వర్గాల సమాచారం.  
 
 చినబాబు ఆశీస్సులు..
 ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న చినబాబు మద్యం సిండికేట్‌కు వెన్నుదన్నుగా ఉన్నట్టు చెబుతున్నారు. మద్యం వ్యాపారంలోని తమ వర్గం ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ద్వారా పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. నగరంలోని మద్యం సిండికేట్‌లో చక్రం తిప్పుతున్న నేత జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధి అనుచరుడిగా ఉన్నాడు. కీలక ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు చినబాబు నగరంలో ఉన్నప్పుడు హడావుడి అంతా మద్యం సిండికేట్ నేతదేనని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు