– పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్పీ
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు సేవలందించిన పోలీస్ డాగ్ 'అర్జున్' ఇక లేదు. మంగళవారం తెల్లవారుజామున డాగ్స్క్వాడ్ గదిలో ఆకస్మికంగా మృతిచెందింది. జర్మన్ స్నఫర్ జాతికి చెందిన బ్రీడ్ అర్జున్. ఈ డాగ్ 2007 జూన్ నుంచి 2008 మే వరకు మొయినాబాద్ ఐఐటీఏలో శిక్షణ పొంది 2008 మే 30 నుంచి చనిపోయేవరకు రాయలసీమ జిల్లాల్లో సేవలు అందించింది. వాసన పసిగట్టడంలో ఈ డాగ్ దిట్ట. శివరాత్రి, తిరుమల బ్రహ్మోత్సవాలు, ఎలక్షన్ బందోబస్తు, వీవీఐపీ, వీఐపీ విధులు, బీడీ టీమ్తో పాటు విధుల్లో భాగంగా పేలుడు పదార్థాలను గుర్తించడంలో అర్జున్ డాగ్ ప్రతిభ కనపరచి అందరి మన్ననలను అందుకుంది. జిల్లాకు వచ్చినప్పటి నుంచి 9 సంవత్సరాల 6 నెలల పాటు సేవలు అందించిన అర్జున్ చనిపోవడంతో సంరక్షకుడిగా డాగ్ హ్యాండ్లర్ చంద్రశేఖర్(పీసీ నెం.2871) కన్నీటి పర్యంతమయ్యారు. అర్జున్ మృతదేహానికి మంగళవారం ఉదయం ఎస్పీ ఆకే రవికృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. డాగ్ స్క్వాడ్కు సంబంధించి కొత్త గదులను ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్ఐలు రంగముని, జార్జి, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది అర్జున్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.