పోలీస్ ఫెయిల్..!

2 Jul, 2016 08:04 IST|Sakshi

సాక్షి,విశాఖపట్నం: రెండు రోజుల ముందునుంచి ఘర్షణలు జరుగుతున్నాయని,అక్కడ పరిస్థితి చేయిదాటుతుందని తెలుసు. అయినా ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని ఊహించలేకపోయారు. దారుణాన్ని ఆపలేకపోయారు. పాల్మన్‌పేట దారుణకాండలో పోలీసుల వైఫల్యం స్పష్టమైంది. పాల్మన్‌పేటలో మంత్రి సోదరుడి గూండాలు అమాయకులపై దాడి చేసి చావగొట్టడంతో పాటు ఆస్తులు, వాహనాలు ధ్వంసం చేసిన ఘటనకు ముందు రెండు చిన్న చిన్న గొడవలు జరిగాయి.  

తొలుత ఒక యువకుడిని కొందరు అకారణంగా కొట్టారు. అనంతరం కొందరిని ఇరవై మంది అడ్డుకుని బావ బాదారు. ఈ రెండు సంఘటనపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. మొదట పట్టించుకోని ఎస్‌ఐ సత్యనారాయణ రెండోసారి ఘర్షణలు జరిగిన తర్వాత విచారణకు వచ్చారు. నిందితులను విచారించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెళ్లిపోయారు.

అప్పటికే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రెండు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పది మందిని కాపలా ఉంచారు. కానీ తెల్లారేసరికి వందలాది మంది ఊరిమీద పడి దారుణకాండ సృష్టించనున్నారని పోలీసులు, నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయి.
 
ఎస్‌ఐ మీదే కోపమెందుకు : ఉదయం 8.15 గంటల సమయంలో కత్తులు, కర్రలు, ఈటెలు పట్టుకున్న వందలాది మంది గ్రామంపై దాడికి వచ్చారు. కొందరు కానిస్టేబుళ్లు గూండాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపైనా దాడి చేసి గాయపరిచారు. ఆ సమయంలో అక్కడికి వ చ్చిన పాయకరావుపేట ఎస్‌ఐ సత్యనారాయణ గూండాలను నియంత్రించడానికి కానిస్టేబుళ్లలా కూడా ప్రయత్నించలేదు.

అతనికి ఎదురుగానే గూండాలు మరోసారి కొట్టడంతో బాధితులు నిస్సహాయంగా పరుగులు తీశారు. ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకుని పాల్మన్‌పేట వాసులు ఎస్‌ఐపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.   75మంది అరెస్ట్: పాల్మన్‌పేట వాసులపై దాడులకు పాల్పడిన కేసులో ఇంత వరకూ 75 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఏసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఈ ఘటనలో రాజయ్యపేట, వేమవరం,ఈదడం, ఆడలవారి వీధిలకు చెందిన 100 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.

>
మరిన్ని వార్తలు