-

సైకిళ్లపై పోలీసుల శాంతి ర్యాలీ

4 Sep, 2016 23:14 IST|Sakshi
సైకిళ్లపై పోలీసుల శాంతి ర్యాలీ
కర్నూలు:  వినాయక చవితి, బక్రీద్‌ పండుగలను పురస్కరించుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కర్నూలు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాతబస్తీలోని జమ్మిచెట్టు నుంచి కేసీ కెనాల్‌ దగ్గర ఉన్న వినాయక ఘాట్‌ వరకు సైకిల్‌ ర్యాలీ సాగింది. హిందూ, ముస్లీం మత పెద్దలతో కలిసి జమ్మిచెట్టుదగ్గర శాంతి కపోతాలు ఎగురవేసి, ఎస్పీ ఆకె రవికృష్ణ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. జమ్మిచెట్టు, కింగ్‌మార్కెట్‌ మీదుగా వినాయక ఘాట్‌ వరకు ర్యాలీ సాగింది. గణేష్‌ కమిటీ సభ్యులతో కలిసి వినాయక నిమజ్జన ఘాట్‌ను ఎస్పీ పరిశీలించారు. ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబు ప్రసాద్, రామచంద్ర, వినోద్‌కుమార్, ఉసేన్‌పీరా, గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కపిలేశ్వరయ్య, సీఐలు కృష్ణయ్య, ములకన్న, మధుసూదన్‌రావు, నాగరాజు రావు, నాగరాజు యాదవ్‌ పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా వివిధ కాలనీలోని మత పెద్దలతో ఎస్పీ మాట్లాడారు. వినాయక చవితి, బక్రీద్‌ పండుగలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో  భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. 
 
మరిన్ని వార్తలు