పోలీసులు అంకితభావంతో పనిచేయాలి

30 Jan, 2017 23:07 IST|Sakshi
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
–  ఎస్పీ ఆకే రవికృష్ణ
 
కర్నూలు :  శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం పోలీసు కార్యాలయంలోని పెరేడ్‌ మైదానంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
 
మహాత్మాగాంధీ ఆచరించిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న భారతదేశం తయారవ్వాలంటే యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, కృష్ణమోహన్, సీఐలు నాగరాజ యాదవ్, మహేశ్వరరెడ్డి, మధుసూదన్, డీపీఓ ఏఓ అబ్దుల్‌ సలాం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, మినిస్టీరియల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
 
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం... 
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయిన కానిస్టేబుల్‌ కుటుంబాలకు పోలీసు సంక్షేమ నిధి నుంచి ఎస్పీ ఆకే రవికృష్ణ ఆర్థిక సాయాన్ని అందించారు. ఏఆర్‌పీసీ రామాంజనేయులు, సివిల్‌ పీసీ నాగరాజు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలకు గురై మతిస్థిమితం కోల్పోయి రెండేళ్లుగా చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబాలు చంద్రరేణుక, కాంతమ్మలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు