సాక్షి ఎఫెక్ట్...
కుమారుల వద్ద ఉండటానికి నిరాకరించిన వృద్ధుడు
నంద్యాల: కుమారుల ప్రేమాభిమానాలకు, ఆప్యాయతకు దూరమై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిరెడ్డిని మంగళవారం పోలీసులు పరామర్శించారు. ‘ ఈ బతుకు నాకొద్దు’ అనే శీర్షికపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా ఎస్పీ రవికృష్ణ స్పందించారు. ఈ కథనం క్లిపింగ్ను వాట్సాప్లో ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ రామయ్యకు పంపి.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఐ రామయ్య, బాలిరెడ్డి కుమారులు లక్ష్మిరెడ్డి, హుసేన్రెడ్డితో కలిసి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా తన ఆవేదనను బాలిరెడ్డి రోదిస్తూ ఎస్ఐ రామయ్యకు వివరించారు. తనకు పొలాన్ని ఇప్పించాలని.. దానిపై వచ్చే కౌలుతో జీవనం సాగిస్తానని చెప్పాడు. దీంతో పొలం ఇవ్వడానికి కుమారులు ఇద్దరు అంగీకరించారు. అయితే తాను కొడుకుల వద్ద ఉండనని, శ్రీశైలానికి వెళ్లి రెడ్ల సత్రంలో ఉంటానని చెప్పారు. వృద్ధుడు కావడంతో మూత్రకోశ వ్యాధులకు ఆపరేషన్ చేసే అవకాశం లేదని.. ఆయన మాత్రలతోనే గడపాల్సి ఉందని వైద్యులు చెప్పారు.