డయ్యింగ్‌ డేంజర్‌

3 Jul, 2017 01:46 IST|Sakshi
డయ్యింగ్‌ డేంజర్‌

♦ కాలుష్య కోరల్లో క్షీరపురి
♦ చీరాలలో 45కు పైగా అక్రమ డయ్యింగ్‌ యూనిట్లు
♦ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులవే ఎక్కువ
♦ కామన్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని మాట మరిచిన యూనిట్ల యజమానులు
♦ డయ్యింగ్‌ యూనిట్లకు విద్యుత్‌ కట్‌ చేసినా  పునరుద్ధరించేలా చేసిన ప్రజాప్రతినిధి
♦ ప్రస్తుతం తూతూ మంత్రంగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు ఆయనే ఫిర్యాదు
♦ కిలోమీటర్ల మేర   కలుషితమైన భూగర్భ జలాలు
♦ సీజింగ్‌ ఆదేశాలు బేఖాతరు


వస్త్రవ్యాపారంలో చినముంబయిగా పేరొందిన చీరాల కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. తమిళనాడు నుంచితరలివచ్చిన డయ్యింగ్‌ యూనిట్ల నుంచి కొన్నేళ్లుగా విడుదలవుతున్న రసాయనాలతో భూగర్భ జలాలన్నీ విషతుల్యమయ్యాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఆయన అనుచరులే నడిపిస్తున్న ఆ డయ్యింగ్‌ యూనిట్లతో చీరాల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.

చీరాల: చీరాలలో చేనేత పరిశ్రమలు ఉండటంతో నూలుకు రంగులు వేసేందుకు అద్దకం అవసరం. ఇందుకు సహజ సిద్ధమైన చిన్నపాటి రంగుల కార్ఖానాలు ఏర్పాటు చేసి వాటికి అద్దకం వేసేవారు. వీటివల్ల పెద్దగా నష్టం ఉండేది కాదు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చీరాల కేంద్రంగా రెడీమేడ్‌ వస్త్రాలు, ఇతర ఫ్యాబ్రిక్స్‌ కూడా తయారు కావడం మొదలైంది.

ఇందుకు చీరాల ప్రాంతంలో 65 భారీ క్యాబినెట్‌ డయ్యింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. నామమాత్రపు అనుమతి కూడా లేకుండా యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని మూతపడగా  ప్రస్తుతం 45 ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే వస్త్రాలకు చీరాలలో డయ్యింగ్‌ జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి 45 మంది వ్యాపారులు చీరాలలో డయ్యింగ్‌ యూనిట్లను అక్రమంగా పెట్టారు.

నియోజకవర్గంలోని ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్నాయి. ఇవి రోజూవారి వదిలే విషపూరిత నీరు సుమారు 50 లక్షల లీటర్లకు పైగానే ఉంటుందని అంచనా. తమిళనాడులోని తిరువూరు, సేలం, ఈరోడ్, కంచి, కుంభకోణం, ఆరణి వంటి ప్రాంతాల్లో డయ్యింగ్‌ యూనిట్లను అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

వాటి నుంచి వచ్చే విషపూరితమైన కలుషిత నీరు భూగర్భ జలాల్లో చొరబడి, విషపూరితంగా మార్చిన ఫలితంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో యూనిట్లపై దృష్టి పెట్టింది. కలుషిత నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు ఉంటేనే డయ్యింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితమైన నిబంధన విధించింది. ఈ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు పెట్టాలంటే కోట్లతో కూడుకున్న పని. దీంతో చీరాలలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక్కడికి తరలివచ్చాయి.   

మాట తప్పి...మడం తిప్పి:
ఆయన నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి. చట్టం, నిబంధనల గురించి అనునిత్యం వల్లె వేస్తుంటారు. కానీ వాటన్నింటి వెనక జనం బాగోగుల కన్నా స్వప్రయోజనాలను చక్కబెట్టుకునే వ్యూహమే ఉంటుంది. క్షీరపురిని కాలుష్య కోరల్లో నెట్టివేస్తున్న డయ్యింగ్‌ యూనిట్ల జోలికి అధికారులెవ్వరూ ఎందుకు వెళ్లరంటే వాటి నిర్వాహకులకు సదరు ప్రజాప్రతినిధే పెద్దదిక్కు మరి. కొత్తపేట, దేవాంగపురి, చీరాలనగర్,  సాయికాలనీ, కోర్టు రోడ్డులో క్యాబినెట్‌ డయ్యింగ్‌లు నడుపుతున్న వారు ఆ ప్రజాప్రతినిధి అనుచరులు. యూనిట్ల నుంచి వచ్చే వృథా నీటిలో దారుణమైన విషవాయువులు కలిసి ఉన్నట్లు 2012లో పరీక్షలు నిర్వహించిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ (ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) మహేష్‌తో పాటు ఇతర అధికారులు నిర్ధారించారు.

ఆ తరువాత అనుమతులు లేవంటూ వాటికి విద్యుత్‌ శాఖాధికారులు సరఫరా నిలిపేశారు. తమిళనాడు డయ్యింగ్‌లను మూసివేస్తే  తన అనుచరులవి కూడా మూతపడతాయనుకుని సదరు ప్రజాప్రతినిధి రంగంలోకి దిగాడు. 2012లో అప్పటి కలెక్టర్‌ కాంతీలాల్‌దండే సమక్షంలో కామన్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ రూ.5 కోట్లు ఖర్చుతో ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు.  ఆ తరువాత విద్యుత్‌ శాఖాధికారులు సరఫరా పునరుద్ధరించేలా చేశారు. కామన్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఇప్పిస్తానని చెప్పిన ఆ ప్రజాప్రతినిధి దాని ఊసే పట్టించుకోలేదు.

కాలుష్య కారకాలతో భూగర్భజలాలు విషతుల్యమై పంట పొలాలు సైతం దెబ్బతినడంతో పాటుగా కుందేరులో గడ్డితిని, నీరు తాగిన పశువులు రోజుకు 4 వరకు మరణిస్తున్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాని నుంచి బయటపడేందుకు ఆ ప్రజాప్రతినిధి మళ్లీ వ్యూహం పన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డయ్యింగ్‌ యూనిట్లను మూసేయాలంటూ ఇటీవల పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డుకు నామమాత్రంగా ఫిర్యాదు చేశారు. ఆమేరకు బోర్డు అధికారులు కూడా డయ్యింగ్‌లను తూతూ మంత్రంగా తనిఖీ చేశారు.

డయ్యింగ్‌ యూనిట్ల యజమానులు పొల్యూషన్‌ బోర్డు అధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయగా ముందు మీ ప్రజాప్రతినిధిని ఒప్పించుకోండని ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత డయ్యింగ్‌ అక్రమార్కుల్లో కొందరు ప్రజాప్రతినిధిని కలిసి ఓ ఒప్పందానికి వచ్చారని సమాచారం. పొల్యూషన్‌ బోర్డు అధికారులు విచారించినప్పటికీ అనుమతిలేని ఒక్క డయ్యింగ్‌ యూనిట్‌ను మూసివేసిన దాఖలాలు లేవు. ఆయన అనుచరుల కోసం కొన్ని క్యాబినెట్‌ డయ్యింగ్‌లకు అండగా ఉండటంతో పాటు కేంద్రం నుంచి వచ్చే అనేక సబ్సిడీలు, పథకాలను వర్తింపజేస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడనే ఆరోపణలున్నాయి.

సంభవించే ప్రమాదాలివే...
ఈ విషపూరితమైన నీరు నేరుగా విడుదల చేయడంతో అవి భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. అలానే కుందేరులో విడుదల కావడంతో ఆ పరిసర ప్రాంతాలతో పాటు సముద్రంలో కలవడం వలన కూడా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లోకి ఈ కలుషిత నీరు చేరుతోంది.

ఈ నీటిని ప్రజలు తాగడం వలన కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో పాటుగా చర్మవ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారు. నీటిలో ఉప్పు శాతం పెరిగిపోవడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతిని జీర్ణకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. అలానే బావులు, బోర్లలోని నీళ్లు మందంగా మారుతాయి. వాటిని తాగడం వలన కూడా అనేక వ్యాధుల బారిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. నీటిలో ఆక్సిజన్‌ శాతం పడిపోతోంది. దీనివల్ల చేపలు, రొయ్యలతో పాటు సముద్ర జీవులు చనిపోతాయి.  

నిబంధనలకు నీళ్లు...
డయ్యింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం ముందుగా సీఎస్టీ అనుమతిని కాలుష్య నియంత్రణ బోర్డు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్‌ పెట్టే స్థలం అందుకు అనుకూలమైందా, స్థానికులకు ఇబ్బందులకు ఏర్పడతాయా అనేది పరిశీలించాలి. ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించిన అనుమతి తీసుకోవాలి. తప్పకుండా యూనిట్ల నుంచి విడుదలయ్యే కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ చీరాలలో ఉన్న డయ్యింగ్‌ యూనిట్లకు ఇటువంటి అనుమతులేమీ లేవు.

నేటికీ అడుగుపడని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌..!
గతంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మహేష్, మరికొందరు అధికారులు అనుమతి లేని డయ్యింగ్‌ యూనిట్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్న డయ్యింగ్‌ యూనిట్ల యజమానులందరూ కలిసి మొత్తం మీద ఒక ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినా నేటికీ పునాదికి నోచుకోలేదు.

ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ప్రత్యేకంగా ఒక పైపులైన్‌ను వేసి డయ్యింగ్‌ యూనిట్ల నుంచి వచ్చే కలుషిత నీటిని ఈ పైపులైన్‌ ద్వారా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు అనుసంధానం చేసేందుకు అంగీకరించినప్పటకీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పెట్టాలంటే రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పిస్తుందని, మిగిలిన మొత్తం డయ్యింగ్‌ యూనిట్ల యజమానులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే డయ్యింగ్‌ యూనిట్ల యజమానులు ఇంత పెద్ద మొత్తం పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం నేటికీ మొదలు కాలేదు.

పోరాటమే శరణ్యం..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయ్యిం గ్‌ యూనిట్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో, మామూళ్ల మత్తుతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కాలుష్య భూతం నుంచి విముక్తి కావాలంటే పోరు తప్పేట్లు లేదని ప్రజలంటున్నారు. నిరసన బాట పట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు.  

చీరాల విషపూరితమవుతుందిలా...
చీరాల ప్రాంతంలో ఉన్న  డయ్యింగ్‌ యూనిట్ల నుంచి రోజుకు 50 లక్షల లీటర్లకు పైగానే వివిధ రసాయనాలు, ఇతర వ్యర్థ పదార్థాలు భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. సుమారు ఒక్కొక్క డయ్యింగ్‌ యూనిట్‌లో రోజూ మూడు నుంచి నాలుగు వేల కేజీల వస్త్రాలకు డయ్యింగ్‌ వేస్తారు. ఒక్కో కేజీ వస్త్రానికి డయ్యింగ్‌ వేయాలంటే 200 లీటర్లు రసాయనాలతో కూడిన నీటిని వినియోగిస్తారు. ఆ తర్వాత వాటిని నేరుగా కుందేరు లేదా ఆ పక్కనే వదిలేస్తున్నారు.

యూనిట్ల నుంచి వచ్చే వ్యథా నీటిలో దారుణమైన విష వాయువులు కలిసి ఉన్నట్లు గతంలోనే పరీక్షలు నిర్వహించిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అప్పటి ఈఈ (ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) మహేష్‌తో పాటు ఇతర అధికారులు నిర్ధారించారు. టీడీఎస్‌ (టోటల్‌ డిజాల్వ్‌ సాలిడ్‌) 2100 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా ఏకంగా 40 వేల మిల్లీ గ్రాములు వరకు ఉంది. అలానే సీఓడీ (కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) 250 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా 4 వేల మిల్లీ గ్రాములు ఉన్నాయి. అలానే సస్పెండెడ్‌ సాలిడ్స్‌ 100 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా 1800 మిల్లీ గ్రాములు వరకు ఉంది.

మరిన్ని వార్తలు