రామయ్యకు బంగారు తులసీ అర్చన

23 Jul, 2016 23:41 IST|Sakshi
కల్యాణంలో పాల్గొన్న భక్తులు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం ఘనంగా బంగారు తులసీ అర్చన నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో మూలవరులకు 108 స్వర్ణ తులసీ దళాలతో అషో్టత్తర శతనామార్చన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపానికి తోడ్కొని వచ్చి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు వివరించారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం అర్చకులు వైభవంగా స్వామి వారికి నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు