సాలూరు రూరల్: మండలంలోని అన్నంరాజువలస పంచాయతీ చీపురువలస గ్రామానికి చెందిన గర్బిణి ఒంటి రాములమ్మ(27) గురువారం సాయంత్రం మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానిక పీహెచ్సీ సబ్సెంటర్ ఏఎన్ఎం పెంటమ్మ తెలిపిన వివరాల ప్రకారం పురిటినొప్పులతో బాధపడుతున్న రాములమ్మను ఆమె బంధువులు గురువారం 108 వాహనంలో సాలూరు పట్టణానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడానికి నిరాకరించిన బంధువులు వారి ఇష్టం మేరకు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని వెంటనే మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఘోషాస్పత్రికి తరలించాలని అక్కడి డాక్టరు సూచించారు. ఈ క్రమంలో విజయనగరం ఘోషాస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆమె కన్నుమూసిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.