అందరివేళ్లూ ఆయన వైపే..

24 Jan, 2017 22:35 IST|Sakshi
అందరివేళ్లూ ఆయన వైపే..

ముఖ్య అధికారి చెప్పిందే వేదం
ఆయన చేతిలోనే జిల్లా విద్యాశాఖ
అనవసర జోక్యంతో ఇబ్బందులు
పెరుగుతున్న వైఫల్యాల చిట్టా
పడిపోతున్న విద్యా ప్రమాణాలు


సుపరిపాలన చేస్తూ.. ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన బాధ్యత జిల్లా అత్యున్నతాధికారిది.  రాజ్యాంగం నుంచి సంక్రమించిన అధికారంతో అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు అందించాల్సిన ఉద్యోగం అది. విద్యావ్యవస్థను బలోపేతం చేసి అట్టడుగుస్థాయి వారికి కూడా నాణ్యమైన చదువు అందేలా చర్యలు తీసుకోవచ్చు.   ఆ అత్యున్నతాధికారి తీరు దీనికి  భిన్నం. సుపరిపాలన కంటే.. టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ ఫలాలు అందించడమేనని ఆయన నమ్ముతారని విపక్షాల నుంచి విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఆయన వైఖరి వల్ల విద్యాశాఖతీరు అధ్వానంగా మారింది.

చిత్తూరు, సాక్షి: జిల్లాలో విద్యాశాఖ పనితీరు తీసికట్టుగా తయారైంది. ఏ జిల్లాలో అయినా జిల్లా విద్యాశాఖ డీఈవో అజమాయిషీలో ఉంటుంది. ఈ జిల్లాలో సర్వోన్నత అధికారి చేతుల్లోనే నడుస్తోందని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. చీటికి మాటికీ  విద్యాశాఖలో వేలుపెడుతూ వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నాయి. దీనివల్ల జిల్లాలో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయి. విద్యాభివృద్ధికి కేంద్రం నుంచి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్‌ పథకం ద్వారా ఏటా నిధులు వస్తాయి. అవి దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ఉద్యోగులనే డిప్యుటేషన్‌పై ఒక డీవైఈవో, ఏవో, సూపరింటెండెంట్, క్లర్క్‌లను కేంద్రం నియమిస్తుంది. వీరికి జీతభత్యాలు కూడా కేంద్రమే చెల్లిస్తుంది. వీరికి జీతాలు చెల్లించే అధికారం అత్యున్నత అధికారికే  కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ అధికారి మాత్రం ఇంతమంది ఉద్యోగులు అవసరం లేదని.. చెబుతూ సూపరింటెండెంట్, క్లర్క్‌లను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. తరువాత సాధారణ బదిలీల్లో సూపరింటెం డెంట్, క్లర్క్‌ పోస్టులను నియమించడం చర్చనీయాంశమైంది.

► 2016లో రాష్ట్రమంతా పునశ్చరణ తరగతులు జరిగినా.. జిల్లాలో మాత్రం జరగలేదు. దీనికి ఆ సర్వోన్నతాధికారి అడ్డుపుల్లే కారణమని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ ని«ధులు వెనక్కి వెళ్లాయి.

►క్లస్టర్‌ రీసోర్స్‌ సెంటర్‌(సీఆర్సీ), మండల్‌ రీసోర్స్‌ సెంటర్‌ (ఎమ్మార్సీ)లకు ప్రతినెలా చెల్లించే నిధులను తగ్గించడంతో ఎమ్మార్వోలు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సీఆర్సీకి ప్రతి నెలా రూ.22 వేలు ఇవ్వాల్సి ఉండగా.. రూ.11 వేలే ఇస్తున్నారు. ఎమ్మార్సీకి ప్రతినెలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.20 వేలతో సరిపుచ్చుతున్నారని మిగిలిన నిధులను ఉపాధ్యాయులే సర్దుకోవాలని ఎమ్మార్వోలు చేతులెత్తేశారు. టీచర్లు ఖర్చులను భరిస్తున్నారు.

►130 మంది సీఆర్పీ, ఎమ్‌ఐఎస్‌ కోఆర్డినేటర్లను పనితీరు బాగాలేదని ఆ అత్యున్నతాధికారి ఆదేశాలతో తొలగించారు. ఇప్పటికీ వాటిని భర్తీచేయలేదు.

► సర్వశిక్షాభియాన్‌ పీవో దగ్గర నుంచి చిన్న ఉద్యోగి వరకు ఇబ్బందులకు గురవుతున్నారని సమాచారం. ప్రతినెలా జీతాల బిల్లుపై సంతకం పెట్టకుండా పక్కన పెడుతున్నారనీ.. దీంతో రెండు మూడు నెలలకొకసారి జీతాలు తీసుకోవాల్సి వస్తోందని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు.

► రాష్ట్రంలో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయులకు వర్క్‌ అలాట్‌మెంట్‌ జరిగిపో యింది.  ఈ జిల్లాలో డీఈవో ఒప్పుకున్నా అత్యున్నతాధికారి ఒప్పుకోకపోవడం వల్లే ఆగిపోయిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా పదోతరగతి ఫలితాల్లో వెనుకబడే అవకాశం ఉందని ఉపాధ్యాయులంటున్నారు.

► ప్రభుత్వ పాఠశాలల్లో 37 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  భర్తీకి సర్వోన్నతాధికారి అడ్డుపడుతున్నారని సమాచారం. హెడ్మాస్టర్‌ పోస్టు లు భర్తీచేయాలని 6 నెలలుగా ఉపాధ్యాయ సంఘా లు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోలేదని తెలుస్తోంది.

► జిల్లా ముఖ్య అధికారి తీరుతో మధ్యాహ్న భోజన వ్యవస్థ కూడా ప్రభావితమైంది. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ఏజెన్సీల నిర్వాహకులకు బిల్లులు చెల్లించే అధికారం ఎమ్మార్వోకు కట్టబెట్టారు. ఈ జిల్లాలో మాత్రం డీఈవోకు అధికార మిస్తూ ఆయన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం అవుతోంది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు అప్పులబారిన పడుతున్నారు.

► సర్వశిక్షాభియాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేసే ఇంజినీరింగ్‌ ఉద్యోగులు, ఏఈలను కుదించడంతో.. మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర పనులు నిలిచిపోయాయి.
 

మరిన్ని వార్తలు