ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటిషన్ 7కు వాయిదా

3 Nov, 2016 18:25 IST|Sakshi

గుంటూరు : ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి కేసులో నిందితురాలిగా ఉన్న  జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి 12 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉంది. అయితే ముందస్తు బెయిల్ కోసం గుంటూరు జిల్లా కోర్టులో ఆమె తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను కోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు కేసు డైరీ కోర్టుకు పంపకపోవడంతో బెయిల్‌పై విచారణను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చారు.

అప్పటివరకు ప్రొఫెసర్ లక్ష్మికి తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. గురువారం పీజీ విద్యార్థులు భారీగా కోర్టు వద్దకు చేరుకుని ఉత్కంఠగా ఎదురు చూశారు. మరోవైపు తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ మృతురాలు డాక్టర్ సంధ్యారాణి తండ్రి సత్తయ్య తరఫు న్యాయవాది వైకే గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సైతం కోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని విచారణ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు