అవకతవకల బదిలీలు

11 Jul, 2016 09:22 IST|Sakshi

కలెక్టర్‌ కార్యాలయం అంటే జిల్లాకు...ప్రభుత్వ శాఖలకు ఆయువు పట్టులాంటిది. ఇతర శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన కార్యాలయం. అయితే ఇక్కడా అవకతవకలకు తక్కవేం కాదన్న రీతిలో రెవెన్యూ ఉద్యోగ వర్గాల నుంచే విమర్శులు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఇటీవల వీఆర్‌ఓలకు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడంలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల 10 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు టైపిస్టులు, 26 మంది వీఆర్‌ఓలకు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పదోన్నతులు కల్పించడంలో నిబంధనలు పాటించలేదని పలువురు ఉద్యోగులు చెప్తున్నారు. జీవో 495 ప్రకారం అనుసరించాల్సిన విధానాలకు నీళ్లొదిలారని చెప్తున్నారు. గతంలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులుగా వెళ్లారని చెబుతున్నారు. వారంతా తిరిగి సొంత శాఖకు వచ్చారన్నారు. ఇందులో పదో తరగతి విద్యార్హత ఉన్న వారిని రికార్డు అసిస్టెంట్‌ కేడర్‌లోనూ, ఇంటర్మీడియట్‌ విద్యార్హత ఉన్న వారిని జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో ఉంచారన్నారు.

అర్హులకు అన్యాయం  
ప్రస్తుతం ఇచ్చిన పదోన్నతుల్లో రెండు కేడర్లకు సంబంధించి వేర్వేరు జాబితా సిద్ధం చేసి, దాని ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉందని ఉద్యోగులు అంటున్నారు. నిబంధనల మేరకు రికార్డ్‌ అసిస్టెంట్‌ నేరుగా సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందే అవకాశం లేదన్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందిన తరువాతనే సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాల్సి ఉంటుందన్నారు. అయితే అధికారులు భిన్నంగా రెండు కేడర్లను కలిపి ఒకే జాబితా తయారు చేసి, పదోన్నతులు కల్పించారన్నారు. దీంతో ఇప్పటికే జానియర్‌ అసిస్టెంట్లుగా ఉన్నవారు నష్టపోవాల్సి వస్తోందని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు.

ఫిర్యాదు చేసినా కదలిక లేదు
అవకతకవలపై కలెక్టరేట్‌ ఉన్నతాధికారులకు లిఖితlపూర్వకంగా ఫిర్యాదు చేశామని బాధిత ఉద్యోగులు చెప్పారు.  అర్హులకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పారని, అయితే రోజులు గడుస్తున్నా తప్పుల్ని సరిచేయడంలో జ్యాపం చేస్తున్నారన్నారు. పదోన్నతులు పొందిన వారు ఆ కేడర్‌లో ఈ నెల వేతనం తీసుకుంటే, వారికి పూర్తి హక్కు వస్తుందని అంటున్నారు. దీన్ని దష్టిలో ఉంచుకొని తక్షణం న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అధికారులు పట్టించుకోక పోతే తామే ముందుగా కోర్టుకు వెళతామని బాధిత ఉద్యోగులు స్పష్టం చేశారు.

నిబంధనల మేరకే పదోన్నతులు
నిబంధనల మేరకే వీఆర్‌ఓలకు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాం. 2014 పీఆర్‌సీ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారంతా జూనియర్‌ అసిస్టెంట్‌లుగా గుర్తించారు. మాకు అన్యాయం జరిగిందని కొందరు ఉద్యోగుల నుంచి ఫిర్యాదు అందాయి. వారి అనుమానాలు నివత్తి చేసేందుకు వీఆర్‌ఓల సర్వీస్‌ రిజిష్టర్లను పరిశీలిస్తున్నాం.  రెండు మూడు రోజుల్లో ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి, వారి అనుమానాలు నివృత్తి చేస్తామని డీఆర్వో పీహెచ్‌ హేమసాగర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు