కర్నూలు (న్యూసిటీ): నారాయణ, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన వారిపై సీఐడీ విచారణ జరిపించాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస ఆచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ విద్యార్థులు ఉరితాళ్లతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ర్యాంకులు రావాలనే లక్ష్యంతో విద్యార్థులపై వత్తిడి పెంచి.. వారి ఆత్మహత్యలకు కొర్పొరేట్ యాజమాన్యాలు కారణమవుతున్నాయన్నారు. అధ్యాపకులు ర్యాగింగ్ చేస్తున్నా యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ మహేంద్ర, జిల్లా నాయకుడు ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేష్, నగర సంఘటన కార్యదర్శి సుమన్, నగర కార్యదర్శి గణేష్ పాల్గొన్నారు.