కదంతొక్కిన ములుగు

7 Oct, 2016 00:25 IST|Sakshi
కదంతొక్కిన ములుగు
  • ములుగు జిల్లా కోసం ఆందోళనలు
  • అఖిలపక్షం నాయకుల ధర్నా, రాస్తారోకో
  • రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జెడ్పీటీసీ సభ్యులు
  • ములుగు : ములుగును జిల్లాగా చేయాల్సిందేనని అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ములుగులో చేపట్టిన ధర్నా, రాస్తారోకోలో నియోజకవర్గంలో పలు పార్టీల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. మొదట డీఎల్‌ఆర్‌ ఫంక‌్షన్‌ హాల్‌ నుంచి నృత్యాలు, కోలాటాల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి బస్టాండ్‌ సమీపంలో రాస్తారోకోకు దిగారు. బొందల గడ్డ వద్దురా..ములుగు జిల్లా ముద్దురా అంటూ నినాదాలు చేశారు. వేలాది మంది నాయకులు తరలిరావడంతో జాతీయ రహదారి అంతా కిటకిటలాడగా వాహనాలు మళ్లించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్‌ మాట్లాడుతూ తనతో పాటు టీఆర్‌ఎస్‌ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ సకినాల శోభన్, ఏటూరునాగారం, మంగపేట జెడ్పీటీసీ సభ్యులు వలియాబీ, సిద్ధంశెట్టి వైకుంఠం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాకు సిద్ధం ఉన్నారని.. అందరూ రాజీనామా పత్రాలు ఎంపీడీఓకు అందించి ఆమోదించుకోవాలని కోరారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు ప్రదర్శనలు, మహిళల కోలాటం నడుమ జూనియర్‌ కళాశాల వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సకినాల శోభన్‌ మాట్లాడుతూ ములుగు జిల్లా కోసం పార్టీ ప్రజాప్రతనిధులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ములుగు జిల్లాగా ఏర్పడితే ప్రాంతం బాగుపడుతుందని మంత్రి చందూలాల్‌ సీఎం కేసీఆర్‌ను పలుమార్లు కోరుతూ వచ్చారని అన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వినర్‌ చింతలపూడి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగు జిల్లాగా ప్రకటించాలని అన్నారు. కార్యక్రమంలో మేడారం ట్రస్ట్‌ బోర్డు తాత్కాలిక చైర్మన్‌ కాక లింగయ్య, డైరెక్టర్‌ రమణారెడ్డి, రాజకీయ జేఏసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి,తో పాటు సీపీఐ. టీడీపీ, బీజేపీ వివిధ మండలాల అధ్యక్షులు జంపాల రవీందర్, పల్లె జయపాల్‌రెడ్డి, బాణాల రాజ్‌కుమార్, గట్టు మహేందర్, పోరిక హర్జీనాయక్, సూడి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు గుగ్గిళ్ల సాగర్, దొంతి ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆడెపు రాజు, గజ్జి నగేష్‌, లాల్‌పాషా, యాకుబ్, ఓరుగంటి మొగిలి, కేశెట్టి కుటుంబరావు, అనుముల సురేశ్, చీకుర్తి మధు, కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.  
     
     
మరిన్ని వార్తలు