తణుకుః
పీఆర్టీయూ తలపెట్టిన నాలుగు అంచెల ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 26న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి పువ్వుల ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. రక్షణ లేని నూతన పెన్షన్ విధానం సీపీఎస్ను తక్షణమే నిలిపివేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలన్నారు. 2014 జూన్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు చెల్లించాల్సిన పది నెలల పీఆర్సీ బకాయిలు నగదుగా చెల్లించాలన్నారు. ఎయిడెడ్, మునిసిపల్, గురుకులాల టీచర్ల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఈ విధానంలో ఇబ్బందులను తెలుసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.