సాక్షి, విజయవాడ : కృష్ణా డెల్టా రైతుల కష్టాలను తీర్చేందుకు పులిచింతల ప్రాజెక్టును నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెకును గురువారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టు 80 శాతం పూర్తయిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తిరిగి జాతికి అంకితం ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు ప్రకటించడం హాస్యాస్పదమంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నల్గొండ జిల్లాలో రైతులకు ఇవ్వాల్సిన పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించి, ప్రాజెక్టును పూర్తిగా ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.