దేదీప్యమానం..!

24 Aug, 2016 00:19 IST|Sakshi
దేదీప్యమానం..!
–అంబరాన్నంటిన పుష్కర ముగింపు వేడుకలు
· శ్రీశైలంలో వైభవంగా పుష్పాభిషేకం
· 30 మంది వేదపండితులతో శాస్త్రోక్తపూజలు
·12 టన్నుల పూలతో పుష్పోత్సవం
 
శ్రీౖశైలం: కృష్ణాపుష్కరాల ముగింపు వేడుకలు మంగళవారం శ్రీశైల మహాక్షేత్రంలో అంబరాన్నంటాయి. వందల సంఖ్యలో భక్తులు పవిత్ర పాతాళగంగ వద్దకు మేళ తాళాలతో చేరుకున్నారు. ఓం నమఃశివాయ పంచాక్షరి నామజపం చేస్తూ కృష్ణవేణీ మాతను అనుగ్రహించాల్సిందిగా కోరారు. పుష్కర స్నానం చేసి కలశంలో పాతాళగంగలోని పుష్కర జలాన్ని నింపుకుని మల్లన్న ఆలయప్రాంగణం చేరుకున్నారు. మల్లన్న గర్భాలయ దక్షిణ ద్వారం నుంచి స్వామివార్ల వద్దకు చేరుకుని మూలవిరాట్‌ను అభిషేకించారు. ముపై ్ప మంది వేదపండితుల వేదమత్రోచ్చారణల మధ్య 12 టన్నుల పూలను మల్లన్న పుష్పాభిషేక మహోత్సవానికి వినియోగించారు.  
మల్లన్న పుష్పోత్సవ.... వైభోగం!
అభిషేక ప్రియుడు, మల్లెపూలంటే విపరీతమైన ఆపేక్ష ఉన్న శ్రీమల్లికార్జునస్వామి రంగురంగుల గులాబీలు, అనేక రకాలైన చేమంతులు, వివిధరకాలైన టన్నుల కొద్ది పూలను రాశులుగా పోసి స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపం పక్కనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఓ వైపు వేదపండితులు మంత్రోచ్చారణలతో ఆలయప్రాంగణంలో ప్రతిధ్వనిస్తుండగా, జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామశివాచార్యా స్వామీజీ, దత్తగిరి పీఠాధిపతులు గణపతిపూజతో పుష్పాభిషేకాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి,  నగరి ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి, కలెక్టర్‌ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికష్ణ, ఆర్డీఓ రఘుబాబు..తదితరులు స్వామివార్లకు పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులు వేదికపై ఉన్న శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు పుష్పాలను సమర్పించారు. 
బాణ సంచా వెలుగులు
 పుష్పాభిషేక మహోత్సవం ముగుస్తున్న సమయంలో  బాణ సంచా వెలుగులు ఒక్కసారిగా విరజిమ్మాయి.  దాదాపు గంటపాటు ఆకాశంలో బాణ సంచా వెలుగులు  కనువిందు చేశాయి. కృష్ణాపుష్కరాల ముగింపు వేడుకలలో మల్లన్న వైభోగాన్ని చూసిన భక్తులు ఆధ్యాత్మిక తరంగాలలో తేలియాడారు. ముగింపు వేడుకలను పూసగుచ్చినట్లుగా డాక్టర్‌ దీవి హయగ్రీవాచార్య చేసిన ప్రత్యక్ష వాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు ఉత్సవంలో పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు