పుష్కర తొక్కిసలాటపై నేడు కమిషన్‌ విచారణ

6 Jan, 2017 00:03 IST|Sakshi
పుష్కర తొక్కిసలాటపై నేడు కమిషన్‌ విచారణ
ఇప్పటికైనా వాస్తవాలు బయట పడేనా? 
రాజమహేంద్రవరం క్రైం :  పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్‌ సి.వై.సోమయాజులు నేతృత్వంలో శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో విచారణ జరపనుంది. ఇప్పటికే అనేక సార్లు విచారణ జరిపిన కమిషన్‌ నాలుగోసారి 390 జీఓ విడుదల చేసింది. ఈ జీవో కాలపరిమితి ఈ నెల 29 వరకు  ఉంది. మానవ హక్కుల కమిషన్‌కు మొదటిసారిగా ఇచ్చిన నివేదికలో కలెక్టర్, ముఖ్యమంత్రి పుష్కర ఘాట్‌ లో ఉండడం వల్లే తొక్కిసలాట జరిగిందని నివేదిక ఇచ్చినప్పటికీ, అనంతరం భక్తుల తొందరపాటే తొక్కిసలాటకు కారణమని మాట మార్చారు. అయితే అధారాలు సమర్పించడంతో దాటవేత ధోరణి అవలంబించారు. 
స్వామి భక్తే కొంప ముంచింది
పుష్కరాల సందర్భంగా వీఐపీలకు ప్రత్యేక ఘాట్‌ కేటాయించినప్పటికీ టెలిఫిల్మ్‌ చిత్రీకరణకు వీలుగా ముఖ్యమంత్రి పుష్కర ఘాట్‌లోనే కుటుంబ సమేతంగా  స్నానం చేశారు. మూడు గంటల పాటు నిరీక్షించిన లక్షలాది పుష్కర యాత్రికులను ఒక్కసారిగా ఘాట్‌లోకి అనుమతించడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 29 మంది మృత్యువాత పడగా, 51 మంది గాయాలపాలైయ్యారు. ముఖ్యమంత్రి మెప్పుపొందడానికి అధికారులు తాపత్రయ పడి వీఐపీల వద్దే ఉండిసామాన్య యాత్రికులను, వారి రక్షణను నిర్లక్ష్యం చేశారు. 
బారికేడ్లు తొలగించి వీఐపీలకు అనుమతి
పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు లక్షలాది మంది వస్తారని  ముందుగానే అంచనాలు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టు ఘాట్ల గేట్లు వెడల్పు చేడయంలో అధికారులు విఫలమయ్యారు. గేటు లోపల వైపు ఏడు మెట్లు కూడా తొక్కిసలాట చోటు చేసుకొని భక్తులు మృతి చెండానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చును. అలాగే పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసి బారీకేడ్లు వీఐపీల కార్లు వచ్చేందుకువీలుగా బారికేడ్లు తొలగించారు. అందువలన యాత్రికులు గేటు వద్ద గుంపులు, గుంపులుగా రావడంతో తోపులాట చోటు చేసుకొని ఈ దుర్ఘటన జరగడానికి కారణమైంది.ఇప్పటికైనా అధికారులు ఆధారాలు సమర్పిస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది లేకుంటే నిజం మరుగున పడే ప్రమాదం ఉంది. 
మరిన్ని వార్తలు