సకాలంలో పూర్తి చేయాలి

28 Jul, 2016 22:57 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి
– మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్‌: పుష్కరాల పనులను సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం సోమశిలలోని హరిత హోటల్‌లో పుష్కరాల పనులు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర పనుల ప్రగతిని సంబంధితశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య చర్యలు, దేవాలయాల అభివృద్ధి పనులు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
కొత్తగా నిర్మిస్తున్న రహదారులపై కేజీ వీల్స్‌ ట్రాక్టర్లు తిరగకుండా చూడాల్సిన బాధ్యత గ్రామస్థాయి అధికారులపైనే ఉందన్నారు. ఎక్కడైనా కేజీ వీల్స్‌తో రోడ్లు పాడైతే అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కరాల కోసం ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏవైనా ఉంటే వాటి కోసం త్వరగా ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని, వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని వెల్లడించారు. దేవాలయాల వద్ద విద్యుద్దీపాలంకరణతో పాటు వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, దేవాదాయ శాఖల అధికారులతో పాటు ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, తదితరులు పాల్గొన్నారు. 
 
 
>
మరిన్ని వార్తలు