ఆ పాపం భక్తులదే!

15 May, 2016 08:46 IST|Sakshi
సీఎం బాబు, వీవీపీలు, వీఐపీలు, ఉదయం 6:30 నుంచి ఘాట్‌లో ఉన్నట్లు అప్పట్లో కలెక్టర్ (జూలై 15న 2015) ఇచ్చిన నివేదిక

ముఖ్యమంత్రి, యంత్రాంగం తప్పేమీ లేదట!
పుష్కర ఘాట్ తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ తాజా నివేదిక

 సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార యంత్రాంగం ప్రత్యక్ష ప్రమేయాన్ని దాచిపెడుతున్నారు. ఇందులో తమ తప్పు ఏమీ లేదని, యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని ఏకసభ్య కమిషన్‌కు ఇచ్చేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ రూపొం దించిన 15 పేజీల నివేదిక విస్మయం కలిగిస్తోంది. నాటి ఘటనకు భక్తుల తొందరపాటే కారణమని ఈ నివేదికలో స్పష్టం చేశారు.

గత ఏడాది జూలై 14వ తేదీ నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించారు. ప్రారంభం రోజు ఉదయం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగి ల్చింది. నాటి ఘటనకు ప్రధానం గా సీఎంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. పుష్కరఘాట్‌లో చంద్రబాబు ఎక్కువ సేపు గడపడం వల్లే  తొక్కిసలాట చోటుచేసుకుందని నాడు నివేదిక లో స్పష్టం చేసిన కలెక్టర్.. బాబు పుష్కర స్నానానికి ఈ ఘటనతో సంబంధం లేదని తాజా నివేదికలో వెనకేసుకు రావడం గమనార్హం.

 తాజా నివేదికలోని కీలకాంశాలు...
ఘాట్‌కు చేరుకున్న వారు గంటల తరబడి నిద్రాహారాలు లేకుండా నిరీక్షించి ఎండవేడిమి కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారు.ఆక్సిజన్  అందకపోవడ మూ  కారణం.  అధికారులు, పోలీసులు సమూహాన్ని సమర్థవంతంగా నియంత్రించినా అనుకోకుండా ఈ ఘటన జరిగింది.  తొలి రోజు తప్ప మిగిలిన 11 రోజులు ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోలేదు.  పుష్కరఘాట్‌లో భక్తుల ప్రవేశ ద్వారం, బయటకు వె ళ్లే మార్గాలు చాలా వెడల్పుగా ఉన్నాయి.   డాక్యుమెంటరీ చిత్రీకరణకు ఏపీ టూరిజం వారు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్‌కు అనుమతి ఇచ్చారు.  పుష్కర ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఘటన తాలూకు దృశ్యాలు రికార్డు కాలేదు.

మరిన్ని వార్తలు