గణపతి సచ్చిదానంద స్వామి
విజయవాడ (ఆటోనగర్) :
ముక్కోటి దేవతల ఆధ్యాత్మిక తరంగాలు పుష్కర సమయంలో నదిలో ఉంటాయని, ఈ సమయంలో పుష్కరస్నానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం పటమట ఆశ్రమానికి ఆయన విచ్చేశారు. ఆశ్రమ అర్చకులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఆశ్రమంలోని క్షిప్ర గణపతికి, మరకత రాజరాజేశ్వరి, దత్తస్వామి, గంగాధరేశ్వరాలయాలను సందర్శించి హారతులిచ్చి మాట్లాడారు. రాజధాని ఏర్పడిన వెంటనే వచ్చిన మొదటి పుష్కరమని, ఇది శుభమని, రాష్ట్రాభివృద్ధిని సాధించాలని జగన్మాతను కోరుకుంటున్నానని స్వామీజీ అన్నారు.