లాల్‌దర్వాజాలో రియో స్టార్

27 Aug, 2016 22:23 IST|Sakshi
లాల్‌దర్వాజాలో రియో స్టార్

చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనే పతకాన్ని సాధించగలిగానని ఒలింపిక్స్‌ రజత పతక విజేత పి.వి.సింధు అన్నారు. లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారిని శనివారం ఉదయం 7.30 గంటలకు ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు బ్యాండ్‌ మేళాల నడుమ ప్రత్యేక స్వాగతం పలికారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ...ఒలింపిక్స్‌కు ముందు తాను అమ్మవారిని దర్శించుకొని పతకం రావాలని వేడుకున్నానని చెప్పారు. ఇకపై ప్రతి బోనాల జాతరలోనూ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తానన్నారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ ఆమెకు పూలబొకే అందజేసి పాతబస్తీలో త్వరలో నిర్వహించే 5కే రన్‌కు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు.

పలువురు చిన్నారులు ఆమెకు పూలబొకేలు అందజేసి కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు రమణ, విజయ, ఆలయ కమిటీ చైర్మన్‌ సి.రాజ్‌కుమార్‌ యాదవ్, ప్రతినిధులు కె.వెంకటేశ్, మహేశ్‌ గౌడ్, మాణిక్‌ ప్రభు గౌడ్, యు.సదానంద్‌ గౌడ్, పోసాని సదానంద్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు