హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరును మరింత ఉదృతం చేయాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణలో పలు సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చారు.
సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు రెండో లేదా మూడో వారంలో వరంగల్, హైదరాబాద్ నగరాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ఓటుకు కోట్లు కేసు తదితర అంశాలను కూడా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ చర్చించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరును మరింత ఉదృతం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.