ఏలూరు అర్బన్ : రైలు ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడొకరు మరణించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెరవలి మండలం కాకరపర్రు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సంగీత వీర రాఘవులు (75) ద్వారకాతిరుమల వెళ్లేందుకు మంగళవారం తాడేపల్లిగూడెం నుంచి రైలులో భీమడోలు జంక్షన్కు వచ్చారు. ఈ నేపథ్యంలో ద్వారకాతిరుమల వెళ్లేందుకు బస్ ఎక్కేందుకు పట్టాలు దాటే క్రమంలో అదే సమయంలో అటుగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడ్ని రైల్వే పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆయన ఆసుపత్రిలోనే మృతిచెందారని రైల్వే హెచ్సీ జాన్సన్ తెలిపారు.