మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థమై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రచయిత విజయేంద్రవర్మ, రాజమౌళి సతీమణి రమారాజమౌళి, నిర్మాత సాయి సోమవారం మధ్యాహ్నం మంత్రాలయం వచ్చారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతలు పట్టారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. మఠం దివాన్ వాజీరాజాచార్ ఫల, పూల, మంత్రాక్షలను అందజేశారు.
రాజమౌళి కుటుంబ సభ్యులు ముగతి వ్యవసాయక్షేత్రంలో పర్యటించారు. సోమవారం ఉదయం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకొని మార్గమధ్యంలో ముగతి ఫారంలో వనభోజనాలు చేశారు. వనభోజనాల్లో రాజమౌళి దంపతులు, సినీడిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి దంపతులు, ఎమ్మిగనూరు డిస్ట్రిబ్యూటర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.