జగన్‌కు మన్యజనం నీరాజనం

9 Dec, 2016 23:08 IST|Sakshi
జగన్‌కు మన్యజనం నీరాజనం
-దిగ్విజయంగా ఏజెన్సీ పర్యటన
-ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
చింతూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఏజెన్సీలో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని, ఈ పర్యటనకు అపూర్వ జనస్పందన లభించిందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులు, రైతులు, కాళ్లవాపు బాధితుల కష్టాలను జగన్‌ స్వయంగా తెలుసుకున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారని చెప్పారు. పర్యటన ఆద్యంతం జగన్‌కు గిరిజనులు నీరాజనం పలికారని, వ్యవసాయ పనులున్నా పక్కనబెట్టి జననేతను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పర్యటనను విజయవంతం చేసేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహన్ని కలిగించిందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహించడంతో పాటు పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముత్యాల మురళి, చింతూరు మండల కన్వీనర్‌ ఎగుమంటి రామలింగారెడ్డి, యూత్‌ కన్వీనర్‌ తుర్రం తమ్మయ్య, రేవు బాలరాజు, చిక్కాల బాలు, రాజు భవాని ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
>
మరిన్ని వార్తలు