కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : నగరంలో ఒంటరిగా నివసిస్తోన్న ఓ వివాహితపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కాకినాడ సబ్ డివిజినల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. తుని పట్టణం సీతారామపురానికి చెందిన వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మూడు నెలలుగా పెద్దాపురంలోని తల్లి ఇంట్లో ఉంటుంది. ఈ నెల 3న రాత్రి భర్త వద్ద కెళుతున్నానని చెప్పి పుట్టింటి నుంచి కాకినాడలో ఉంటోంది. ఈ నెల 8వ తేదీ రాత్రి 10 గంటలకు కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆమెను కాకినాడ ఎన్టీఆర్ విగ్రహం వీధి, పేర్రాజుపేటకు చెందిన ఆటో డ్రైవర్ కొప్పిశెట్టి శ్రీను గమనించాడు. అమాయకంగా ఉన్న ఆమె వాలకాన్ని గమనించిన శ్రీను బస్టాండ్ నుంచి ఆటోలో ఎక్కించుకుని కల్పనా సెంటర్ సమీపంలో ఉన్న ఓ లాడ్డిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ లాడ్డి గుమస్తాలు కాకినాడ రూరల్ తూరంగికి చెందిన ఇందుకూరి కనకరాజు, కాకినాడ సోమయాజులు వీధికి చెందిన కొమ్మా భార్గవ్(మహేష్).. శ్రీనుకు కొంత సొమ్ము ఇచ్చి ఆమె కూడా లైంగిక దాడి చేశారు. అనంతరం నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను ఒక పాత్రికేయుడు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ఈ ఘటన ప్రసార మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడంతో టూ టౌన్ పోలీస్లు కేసు దర్యాప్తు చేపట్టినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులు కాకినాడ ఆనందభారతి గ్రౌండ్లో ఉన్నట్టు సమాచారం రావడంతో టూటౌన్ సీఐ ఉమర్, ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడి చేసి అరెస్ట్ చేశామన్నారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరపరచగా రిమాండ్ విధించిందన్నారు. కేసును సత్వరంగా ఛేదించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సత్యనారాయణలను డీఎస్పీ అభినందించారు.