రాయదుర్గం: జీన్స్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన రాయదుర్గంలో జీన్స్ రంగం అనుకున్నంత అభివృద్ధి బాట ఎందుకు పట్టలేదనే అంశాలపై హైదరాబాద్ ఆర్బీఐ మేనేజర్ అనిల్కుమార్ కాల్బొరె గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు. 74 ఉడేగోళం వద్ద టెక్స్టైల్ పార్కు లో 55 యూనిట్లకు గాను 5 యూనిట్లు నిర్మాణం జరుగగా 4 యూనిట్లు మాత్రమే ప్రారంభం కావడం , మిగిలినవి ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను ప్రస్తుతం ఉత్పత్తిలో ఉన్న యూనిట్ దారులతో చర్చించారు. యూనిట్లను ఎలా నడుపుతున్నారు, వర్కర్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఒక్కో యూనిట్లో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, వారికి కూలీలు గాని, వేతనాలు గాని ఎంత? ఎలా చెల్లిస్తున్నారు అని కార్మికులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
జీన్స్ క్లాత్ ఎక్కడి నుండి తెస్తున్నారు, బ్యాంకు రుణాలు , లావాదేవీల గురించి యజమానులను అడిగారు. 55 యూనిట్లకు గాను 5 యూనిట్లు మాత్రమే నిర్మాణం జరిగాయని, బ్యాంకులు ప్రోత్సాహం అందించకపోవడంతోనే యూనిట్ల నిర్మాణం జరగడం లేదని లక్ష్మీఎంటర్ ప్రైజెస్ యజమాని ప్రసాద్ తెలిపారు. అనంతరం పట్టణంలో జీన్స్ తయారీ చేస్తున్న దుకాణాల్లోకి వెళ్లి అనిల్కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన వివరాల నివేదికను ఆర్బీఐకు పంపుతున్నట్లు కాల్బొరె తెలిపారు.