రెవెన్యూ సిబ్బందిపై భూ మాఫియా దాడి

27 Jul, 2015 10:04 IST|Sakshi
రెవెన్యూ సిబ్బందిపై భూ మాఫియా దాడి

అధికారపార్టీ అండతో వీఆర్వో, వీఆర్‌ఏను చితకబాదిన కబ్జాదారులు


మంగళగిరి: రెవెన్యూ అధికారులపై అక్రమార్కులు, కబ్జాదారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు, కృష్ణా జిల్లా ముసునూరు తహసీర్దార్లు నారాయణమ్మ, వనజాక్షిలపై అధికార పార్టీ నేతలు చేసిన దాడుల తీవ్రత చల్లారకముందే గుంటూరు జిల్లా మంగళగిరి లో ఆదివారం వీఆర్వోపై భూ కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని అనుకుని ఉన్న సర్వే నంబరు 366లో అదే గ్రామానికి చెందిన బొమ్ము ఉమామహేశ్వరరెడ్డితోపాటు మరో ఇద్దరికి ప్రభుత్వం గతంలో 65 సెంట్లకు డీ పట్టాలు మంజూరు చేసింది.  

ఈ భూమి రికార్డు ల్లో మాత్రం వాగు పోరంబోకుగా నమోదుగా ఉంది. మంగళగిరికి చెందిన కొందరు అందులోని 20 సెంట్లకు నకిలీ దస్తావేజులు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నించగా అనుభవదారులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పిలిపించి న పోలీసులు, ఆ భూమి విషయం తేల్చేవరకు అక్కడ అడుగుపెట్టవద్దని హెచ్చరిం చారు. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోయిన భూ మాఫి యా ఆదివారం స్థలం లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక తహశీల్దార్ వీఆర్వో శ్రీనివాసరావును పరిశీలనకు పంపారు.

వీఆర్‌ఏ చలపతిరావుతో కలిసి స్థలం వద్దకు వెళ్లిన వీఆర్వో.. నిర్మాణాలు ఆపాలని వారికి సూచించారు. అక్కడే వున్న కరిముల్లాతో పాటు మరో ఐదుగురు రెవెన్యూ సిబ్బందిని దూషించడంతో ఘర్షణ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన ఆరుగురు వీఆర్‌వో , వీఆర్‌ఏలపై దాడి చేశారు. కాగా, దాడికి నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తం గా వీఆర్‌ఏలు, వీఆర్‌వోలు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘం నేతలు తెలిపారు.

మరిన్ని వార్తలు