‘ఇందిరమ్మ’ బిల్లులొచ్చేశాయ్!

25 Oct, 2015 03:13 IST|Sakshi

 రూ.178 కోట్లు విడుదల

 సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాం లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న 39,429 ఇళ్లకు పెండింగు బిల్లులు విడుదల చేసింది. తొమ్మిది జిల్లాలకు సంబంధించి రూ.178 కోట్లను విడుదల చేసింది. ఇందులో రూ.40 కోట్లు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో జమ ్ఞ్ఞఅయ్యాయి. మిగిలిన మొత్తాన్ని సోమవారం నుంచి వేగంగా లబ్ధిదారుల ఖాతాలకు మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 4.5  లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉండగా కేవలం 50వేల ఇళ్లనే ప్రభుత్వం తొలుత పరిగణనలోకి తీసుకుంది. మిగతా వాటిని ‘విచారణ’ పేరుతో ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది.

 కలెక్టర్ల విచారణ అనంతరమే నిధులు: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల బకాయిల విడుదల ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. దాదాపు రూ.500కోట్లు చెల్లించాల్సి రావటంతో తొలుత కొన్నింటినే చెల్లించాలని నిర్ణయించిం ది. నిర్మాణం పూర్తి చేసుకున్న దాదాపు 50 వేల ఇళ్లను ఇందుకు ఎంపిక చేసుకుంది. సీఐడీ దర్యాప్తు చేయించిన ప్రభుత్వం... ఈ 50 వేల ఇళ్లకు సంబంధించి కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ జరిపి అర్హులనే ఎంపిక చేయాలని నిర్ణయించింది. విచారణ జరిపి అందులో 5,600 మంది లబ్ధిదారులను అనర్హులుగా తేల్చింది. కాగా, దీర్ఘకాలంగా బిల్లుల చెల్లింపు లేక  బ్యాంకు ఖాతాల లావాదేవీలు నిలిచిపోవటంతో లబ్ధిదారుల ఖాతాలను బ్యాంకర్లు స్తంభింపజేశారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలంటే లబ్ధిదారులు రూ.వంద చెల్లించాలని బ్యాంకర్లు అంటున్నారు.

మరిన్ని వార్తలు