బియ్యం అక్రమ రవాణా నిత్యకృత్యం

18 Jan, 2017 04:37 IST|Sakshi

చౌటుప్పల్‌ :ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బియ్యాన్ని రవాణా చేయడం వ్యాపారులకు నిత్యాకృత్యంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల అక్రమ వ్యాపారుల పంట పండుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బియ్యాన్ని తరలించాలంటే అనుమతులు పొందాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి వాహనంలో లోడు విలువను బట్టి ఐదు శాతం ట్యాక్స్‌ చెల్లించాలి. కానీ ట్యాక్స్‌ చెల్లించేందుకు అధికారులు సిద్ధపడట్లేదు. తప్పనిసరిగా ట్యాక్స్‌ చెల్లించాల్సి వస్తే.. తిమ్మినిబమ్మిని చేసి నామమ్రాతంగా చెల్లించి అక్కడి నుంచి జారుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్‌ చెల్లించిన దానికంటే రెండింతలు ఎక్కువగా లోడును తీసుకెళ్తారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎప్పుడోఒకప్పుడు నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

తాజాగా నాలుగు డీసీఎంల బియ్యం పట్టివేత
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నాలుగు డీసీఎం వాహనాల్లో తరలుతున్న బీపీటీ బియ్యంతోపాటు ఇసుకను తీసుకెళ్తున్న మరో డీసీఎంను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి వద్ద జాతీయ రహదారిపై జీఎమ్మార్‌ టోల్‌ప్లాజా వద్ద విజిలెన్స్‌ సీఐ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా తరలుతున్న బియ్యం, ఇసుక డీసీఎం వాహనాలను గుర్తించా రు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న ఒక డీసీఎంతో పాటు అదే జిల్లా మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న రెండు డీసీఎంలు, అలా గే గరిడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న మరో డీసీఎంను పట్టుకున్నారు. ఇవేకాక, నకిరేకల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఇసుక డీసీఎం పట్టుబడింది. సరుకుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ కేసుకు సంబంధిచిన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారూలకు  అందించామని విజిలెన్స్‌ సీఐ రాజు తెలిపారు. ఆయా శాఖల అధ్వర్యంలోనే కేసులు నమోదు చేస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా నాలుగు డీసీఎంలలో ఎన్ని క్వింటాళ్ల బియ్యం ఉన్నాయన్న విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

మరిన్ని వార్తలు